
వర్ని, వెలుగు: పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి తల్లిని హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో జరిగింది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జలాల్పూర్ గ్రామానికి చెందిన మక్కపల్లి సాయవ్వ (57) ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బులతో జీవిస్తోంది. కాగా పింఛన్ డబ్బులు తనకే ఇవ్వాలని ఆమె కొడుకు సాయిలు తల్లితో గొడవ పడ్డాడు.
డబ్బులు ఇచ్చేందుకు సాయవ్వ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన సాయిలు కుర్చీతో తల్లిపై దాడి చేశాడు. తర్వాత బండరాయితో తల, పొట్టపై కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సాయవ్వను గమనించిన స్థానికులు 108లో బోధన్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.