న్యూఢిల్లీ: ‘నా కుటుంబ సభ్యుల గురించి ఇప్పటివరకు చాలానే రాశారు. కానీ, వారి మానవతా దృక్పథాన్ని నిజమైన కోణంలో వెలుగులోకి తెచ్చింది కొందరు మాత్రమే’ అని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. కుటుంబ సభ్యుల మానవత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పేరిట తన ఆత్మకథను పుస్తకం రూపంలో తీసుకొస్తున్నట్లు తెలిపారు.
సోనియా గాంధీ రాసిన తన ఆటోబయోగ్రఫీ బుక్ నవంబర్ 10న విడుదల కానుందని ప్రముఖ ప్రచురణ సంస్థ ‘ఆల్ఫ్రెడ్ ఎ నూప్’ బుధవారం ప్రకటించింది. ఈ ప్రకటనలోనే తాను రాసిన బుక్ పై సోనియా స్పందించారు. ‘నేను చాలాకాలంగా గోప్యంగా ఉంచిన వ్యక్తిగత అనుభవాలను, భావోద్వేగాలను తిరిగి గుర్తు చేసుకోవలసి వచ్చింది. నా జీవితంలో జరిగిన విషాద ఘటనలు, నష్టాలే నన్ను రాజకీయాల్లోకి నెట్టాయి.
‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పేరిట ఆటోబయోగ్రఫీ రాయడం, నా మనసులోతుల్లో దాచుకున్న అనుభవాలను అక్షర రూపంలోకి రాబట్టడం అంత ఈజీగా జరగలేదు. మా కుటుంబం గురించి ఇప్పటివరకు బయట ఎన్నో రకాల కథనాలు, వార్తలు వచ్చాయి. కానీ, మేం తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు ఏమిటి? మేం చేసిన పనుల వెనుక ఉన్న పరిస్థితులు ఏమిటి? అనే నిజాలను చాలా కొద్దిమంది మాత్రమే సరిగ్గా రాశారు.
ఎంతటి వారిలోనైనా కొన్ని బలహీనతలు, భావోద్వేగాలు, పొరపాట్లు ఉంటాయి. ఆ మానవ సహజమైన కోణాన్ని ఎవరూ చూపించలేకపోయారు. నా కుటుంబ సభ్యుల మానవత్వ కోణంతోపాటు నా జీవిత ప్రయాణంలోని సున్నితమైన ఆనందాలు, నిరాశల సమాహారమే ఈ పుస్తకం’అని సోనియా పేర్కొన్నారు. ' బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకం సుమారు 544 పేజీలతో నవంబర్ 10న రిలీజ్ కానుంది.
