పార్లమెంట్ కొత్త బిల్డింగ్ వద్ద తమన్నా, మంచు లక్ష్మి సందడి

పార్లమెంట్ కొత్త బిల్డింగ్ వద్ద తమన్నా, మంచు లక్ష్మి సందడి

న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవల ప్రారంభమైన కొత్త పార్లమెంట్ భవన సముదాయాన్ని బాలీవుడ్, టాలీవుడ్, స్పోర్ట్స్ స్టార్ లు సందర్శిస్తున్నారు. కొత్త పార్లమెంట్ ప్రారంభమైన తొలిరోజు(సెప్టెంబర్ 19) తెల్ల చీరలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా, మెరిసే డ్రెస్ లో ఈషా గుప్తా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ షెహనాజ్ గిల్, భూమి పడ్నేకర్ కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. గురువారం టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా, నటి మంచు లక్ష్మి సైతం కొత్త పార్లమెంట్ భవనంలో కలియతిరిగారు.

వీరిద్దరు కలిసి కొత్త పార్లమెంట్ ప్రధాన ద్వారం (మకర్ గేట్) వద్ద ఫోటోలకు పోజులిచ్చారు. కేంద్రం మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకురావడంపై వీరు సంతోషం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ ఉమెన్ స్టార్స్ మిథాలి రాజ్, మేరికోమ్, రాణి రామ్ పాల్, దీపా మెహతా కూడా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. మహిళా బిల్లును తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ సెషన్ లో కొత్త పార్లమెంట్ ను విజిట్ చేసేందుకు మహిళలకు ప్రత్యేక అవకాశం కల్పించారు. గురువారం ఒక్క రోజే దాదాపు 7 వేల మంది మహిళలు పార్లమెంట్ ను విజిట్ చేశారు.