
విశాఖపట్నం: విమెన్స్ వన్డే వరల్డ్ కప్లో సౌతాఫ్రికా మరో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. బంగ్లాదేశ్ ఆ జట్టును భయపెట్టినా.. గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. సోమవారం ఉత్కంఠగా సాగిన లీగ్ మ్యాచ్లో క్లో ట్రయాన్ (69 బాల్స్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 62), మరిజేన్ కాప్ (71 బాల్స్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 56) ఫిఫ్టీలతో రాణించడంతో సఫారీ అమ్మాయిలు 3 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలిచి గట్టెక్కారు. తొలుత బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 232/6 స్కోరు చేసింది.
18 ఏండ్ల యంగ్ ఆల్రౌండర్ షోర్ణా అక్తర్ (35 బాల్స్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 నాటౌట్) మెరుపు ఫిఫ్టీతో సత్తా చాటింది. ఆరంభంలో ఓపెనర్లు ఫర్గానా హక్ (30), రుబ్యా హైదర్ (25) నెమ్మదిగా ఆడగా, మిడిలార్డర్లో షర్మీన్ అక్తర్ (50), కెప్టెన్ నిగార్ సుల్తానా (32) మూడో వికెట్కు 77 రన్స్ కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ను నిలబెట్టారు. చివర్లో షోర్ణా మెరుపుతో బంగ్లా గౌరవప్రద స్కోరు చేసింది.
సఫారీ బౌలర్లలో ఎంలాబా (2/42) రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 235/7 స్కోరు చేసి గెలిచింది. రెండో ఓవర్లోనే తజ్మిన్ బ్రిట్స్ (0) డకౌటైనా.. కెప్టెన్ లారా వోల్వర్ట్ (31), అనెకె బాష్ (28) రెండో వికెట్కు 55 రన్స్ జోడించారు. కానీ, ఈ ఇద్దరితో పాటు డెర్క్సెన్ (2), సినలో జాఫ్తా (4) వెంటవెంటనే ఔటవడంతో సఫారీ టీమ్ 78/5తో ఎదురీత మొదలు పెట్టింది.
ఈ టైమ్లో కాప్, ట్రయాన్ ఆరో వికెట్కు 85 రన్స్ జోడించి జట్టును తిరిగి రేసులోకి తెచ్చారు. ఫిఫ్టీలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఇద్దరూ వెనుదిరగడంతో బంగ్లా మళ్లీ రేసులోకి వచ్చింది. కానీ, చివర్లో డిక్లెర్క్ (37 నాటౌట్), మసబాట క్లాస్ (10 నాటౌట్)తో కలిసి సౌతాఫ్రికాను ఒడ్డుకు చేర్చింది. ట్రయాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.