టీ20 ర్యాంకింగ్స్‌‌ల్లో .. టాప్‌‌-2లోనే అభిషేక్‌‌, తిలక్‌

టీ20 ర్యాంకింగ్స్‌‌ల్లో .. టాప్‌‌-2లోనే అభిషేక్‌‌, తిలక్‌

దుబాయ్‌‌: టీమిండియా యంగ్ హిటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ టీ20 ర్యాంకింగ్స్‌‌ల్లో టాప్‌–2 ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌లో అభిషేక్‌‌ 829 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్ ప్లేస్‌లో ఉండగా, తిలక్‌‌ వర్మ (804) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (739), యశస్వి జైస్వాల్‌‌ (673) వరుసగా 6, 10వ ర్యాంక్‌‌లను సాధించారు. చాంపియన్స్‌‌ ట్రోఫీ తర్వాత టీమిండియా వన్డేలు ఆడకపోవడంతో.. బ్యాటర్ల ర్యాంకింగ్‌‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (784) నంబర్‌‌వన్‌‌లోనే కొనసాగుతున్నాడు. 

రోహిత్‌‌ శర్మ (756), విరాట్‌‌ కోహ్లీ (736) రెండు, నాలుగో ర్యాంక్‌‌ల్లోనే ఉన్నారు. అయితే ర్యాంకింగ్స్‌‌ను అప్‌‌డేట్స్‌‌ చేసే క్రమంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రోహిత్‌‌, కోహ్లీ ర్యాంక్‌‌లు టాప్‌‌–100లో కూడా కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా ఈ ఇద్దరి పేర్లు ఆకస్మికంగా మాయం కావడంతో సోషల్‌‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిపై స్పందించిన ఐసీసీ వెంటనే ర్యాంకింగ్స్‌‌ను సరి చేసింది. బాబర్‌‌ ఆజమ్‌‌ (756), డారిల్‌‌ మిచెల్‌‌ (720) వరుసగా రెండు, ఐదో ర్యాంక్‌‌ల్లో ఉన్నారు. కేఎల్‌‌ రాహుల్‌‌ (638).. 15వ ర్యాంక్‌‌ను సొంతం చేసుకున్నాడు. బౌలింగ్‌‌ ర్యాంకింగ్స్‌‌లో రిస్ట్‌‌ స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌ యాదవ్‌‌ (650) ఒక్క స్థానం కిందకు దిగి మూడో ర్యాంక్‌‌లో నిలిచాడు.

 సౌతాఫ్రికా స్పిన్నర్‌‌ కేశవ్‌‌ మహారాజ్‌‌ (687) రెండు స్థానాలు ఎగబాకి మరోసారి టాప్‌‌ ప్లేస్‌‌ను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రాణించడం కేశవ్‌‌కు కలిసొచ్చింది. రవీంద్ర జడేజా (616) తొమ్మిదో ర్యాంక్‌‌లో మార్పు లేకపోయినా.. మహ్మద్‌‌ షమీ (596), మహ్మద్‌‌ సిరాజ్‌‌ (593) ఒక్కో ప్లేస్‌‌ ఎగబాకి వరుసగా 13, 14వ ర్యాంక్‌‌ల్లో నిలిచారు. అయితే నమీబియా స్పిన్నర్‌‌ బెర్నార్డ్‌‌ స్కోల్జ్‌‌ (644) నాలుగో ర్యాంక్‌‌కు చేరుకోవడం అతిపెద్ద ఆశ్చర్యకరమైన విషయం. టాప్‌‌–20లో చోటు దక్కించుకున్న ఏకైన అసోసియేట్‌‌ ప్లేయర్‌‌గా నిలిచాడు. అదే టైమ్‌‌లో నమీబియా తరఫున టాప్‌‌–5లోకి రావడం కూడా అరుదైన ఘనతగా చెప్పొచ్చు.