
హైదరాబాద్ : వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు బుధవారం (మే 24న) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ లోని కాచిగూడ నుంచి తిరుపతి, కాచిగూడ నుంచి కాకినాడ నగరాలకు నాలుగు ప్రత్యేక సర్వీసులు నడపనుంది. మే 25, 26వ తేదీల్లో కాచిగూడ తిరుపతి మధ్య రైళ్లు రాకపోకలు కొనసాగించగా.. కాచిగూడ -కాకినాడ పట్టణం మధ్య 27, 28 తేదీల్లో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
ప్రత్యేక సర్వీసులు ఇవే..
* మే 25న గురువారం రాత్రి 10.10 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు (07061) షాద్నగర్, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గూటీ, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్ల మీదుగా శుక్రవారం ఉదయం 10.30గంటలకు తిరుపతి చేరుకోనుంది.
* మే 26న మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి నుంచి తిరుగుపయనమై..ఈ ప్రత్యేక రైలు (07062) అదే రూట్లో మరుసటి రోజు తెల్లవారు జామున 4గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
* మే 27న శనివారం రాత్రి 8.45గంటలకు కాచిగూడ నుంచి కాకినాడ టౌన్కు బయల్దేరే ప్రత్యేక రైలు (07417) కాజిపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామల్కోట్ స్టేషన్ల మీదుగా మరుసటి రోజు ఆదివారం (మే 28న) ఉదయం 8.45గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది.
* తిరిగి ఆదివారం రాత్రి 9.55 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయల్దేరే ఈ ప్రత్యేక రైలు (07418) అదే రూట్లో సోమవారం ఉదయం 9.45గంటలకు కాచిగూడకు చేరుకోనుంది. ఈ రైలులో సెకెండ్ ఏసీ, థర్డ్ఏసీతో పాటు స్లీపర్, సెకెండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు తెలిపారు.