హైదరాబాద్ సిటీ, వెలుగు: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే కొన్ని రైళ్లను ప్రకటించగా తాజాగా మరో 41 స్పెషల్ రైళ్లను నడపనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. జనవరి 8 నుంచి 20 వరకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు చెప్పారు.
ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ నెల 14వతేదీ నుంచే రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఆదివారం ఉదయం 8గంటల నుంచి రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
