
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా కంపెనీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తమ భారతీయ యూనిట్ను వచ్చే నెలలో ఐపీఓకి తేవాలని చూస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూలో మొత్తం రూ.15 వేల కోట్ల విలువైన 10.2 కోట్ల షేర్లను (15 శాతం వాటాను) అమ్ముతుంది. మొదట ఇది ఏప్రిల్–మేలో రావాల్సి ఉండగా, మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా వేశారు. ఇప్పుడు అక్టోబర్ను సరైన సమయంగా కంపెనీ భావిస్తోంది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కావడంతో, కంపెనీకి నేరుగా నిధులు రావు. షేర్లను అమ్మిన షేర్హోల్డర్కు మాత్రమే లాభాలు వస్తాయి. మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్, యాక్సిస్ క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్ లీడ్ మేనేజర్లుగా, కేఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్నాయి.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 30 ఐపీఓలు రూ.60 వేల కోట్లను సేకరించాయి. హెచ్డీబీ ఫైనాన్షియల్ రూ.12,500 కోట్లతో అతిపెద్ద ఐపీఓగా ఉంది. ఎల్జీ ఐపీఓ పూర్తయితే ఇదే అతిపెద్ద ఐపీఓగా నిలుస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి మరో రూ.70 వేల కోట్ల విలువైన ఐపీఓలు రాబోతున్నాయి. టాటా క్యాపిటల్, గ్రో, మీషో, ఫోన్పే, లెన్స్కార్ట్ వంటి పెద్ద కంపెనీల ఐపీఓలు రానున్నాయి. ఎల్జీ భారత మార్కెట్లో హోమ్ అప్లియెన్సెస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నెంబర్ వన్గా కొనసాగుతోంది. 2024 జూన్ నాటికి 36,401 బీ2సీ టచ్పాయింట్లతో దేశవ్యాప్తంగా అతిపెద్ద నెట్వర్క్ను మెయింటైన్ చేస్తోంది.