హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని ఆదివారం సౌత్ కొరియా బుద్ధిష్ట్ స్టడీస్ నేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతినిధులు సందర్శించారు. సౌత్ కొరియా నేషనల్ యూనివర్సిటీ కి చెందిన విద్యా సాంస్కృతిక ప్రతినిధుల బృందం బుద్ధవనం సందర్శనలో భాగంగా బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు.
అనంతరం బుద్ధ చరిత వనం, జాతకవనం, ధ్యాన వనం, స్తూపవనాలను సందర్శించారు. స్తూప వనంలో ఉన్న సౌత్ కొరియా మహాస్తూపాన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మహా స్తూపం అంతర్భాగంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలను తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు. వారి వెంట ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, ప్రమోషన్స్ టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
