విద్యుత్ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి : డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ

విద్యుత్ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి : డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ
  • .అధికారులకు సదరన్​ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో  విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను సదరన్​ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. సోమవారం మింట్ కాంపౌండ్‌లోని కార్పొరేట్​ఆఫీస్​ నుంచి చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. సూపరింటెండింగ్ ఇంజినీర్లు తమ పరిధిలోని ఫీడర్లపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.  వారానికోసారి సమీక్షలు నిర్వహించాలన్నారు.

 అత్యధిక అంతరాయాలు నమోదైన ఫీడర్లపై దృష్టి సారించి, లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఏబీ స్విచ్‌లను తనిఖీ చేసి, సమస్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పవర్​ ఇంటరప్షన్​కు ప్రధాన కారణం  విద్యుత్ తీగలను చెట్ల కొమ్మలు తాకడమేనని విశ్లేషణలో తేలిందని, క్షేత్ర స్థాయిలో సిబ్బంది చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినియోగదారుల ఫిర్యాదులపై తక్షణం స్పందించి పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, నెట్‌వర్క్ మ్యాపింగ్ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ఈ సర్వేను 33 కేవీ, ఎల్టీ నెట్‌వర్క్‌లలోనూ చేపట్టాలని ముషారఫ్ ఆదేశించారు.