- తెలంగాణకు 4 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు
- ఈ నెల12న రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం
- రానున్న నాలుగు రోజులు మోస్తరు వానలు
- కేరళకు మాత్రం మూడ్రోజుల ముందే
హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి నాలుగు రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. మూడు రోజుల ముందే కేరళలో ప్రవేశిస్తున్నా.. తెలంగాణను మాత్రం ఆలస్యంగా తాకనున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడానికి అనుకూల పరిస్థితులు లేవని, మరో నాలుగు రోజులు పట్టే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘వెలుగు’తో తెలిపారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. రుతుపవనాల ప్రవేశంతో వరుసగా భారీ వర్షాలు ఉంటాయని పేర్కొన్నారు.
రాష్ట్రానికి 12న రాక..!
సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటో తారీఖున కేరళ తీరాన్ని తాకుతాయి. గత ఐదారేండ్లుగా గమనిస్తే వాతావరణ శాఖ అంచనాలు కరెక్ట్అవుతున్నాయి. నిరుడు జూన్3న కేరళను తాకుతాయని అంచనా వేయగా.. అదే తేదీన తాకాయి. నిరుడు జూన్ 5నే రాష్ట్రమంతా విస్తరించాయి. అయితే ఈసారి జూన్2వ తేదీన కేరళకు వస్తాయని అంచనా వేయగా, మూడు రోజులు ముందుగానే కేరళను తాకాయి. తెలంగాణకు మాత్రం ఈ నెల 7 లేదా 8 తేదీల్లో వస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మొదలు అంచనా వేసింది. అయితే బుధవారం వరకు కూడా రాష్ట్రాన్ని తాకలేదు. మరో నాలుగు రోజులు సమయం పట్టనుందని, ఈ నెల12న నైరుతి పవనాలు తెలంగాణలో విస్తరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్తెలిపారు.
106 శాతానికి పైగా వానలు
ఈ సారి వానాకాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే(106శాతానికి పైనే) ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయని పేర్కొంది. జూన్లో నెలలో సాధారణ వర్షపాతమే నమోదుకానుంది. నిరుడు నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా104.47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 39 శాతం అధికంగా వానలు పడ్డాయి. నైరుతి సీజన్లో 105 రోజులు రెయినీ డేస్ నమోదు కాగా, 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన రోజులు 72 ఉన్నాయి. మరో నాలుగు రోజుల్లో నైరుతి ప్రవేశంతో వాతావరణం చల్లబడనుంది. రాష్ట్రమంతా ఎండలు తగ్గనున్నాయి.
వచ్చే నాలుగు రోజులు..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాల్పులు వీయొచ్చని అంచనా వేసింది. బుధవారం రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. టీఎస్డీపీఎస్ డేటా ప్రకారం ఆదిలాబాద్లోని జైనథ్లో 45.2 డిగ్రీలు, జగిత్యాలలోని ఐలాపూర్లో 44.9, సూర్యాపేటలోని తొగర్రాయిలో 44.4, ఖమ్మంలోని తిమ్మారావుపేటలో 44.2 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
