- ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి , వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక ఏరియాలపై దృష్టి సారించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు ఆఫీస్లో నెలవారీ రివ్యూ మీటింగ్ జరిగింది. పెండింగ్ కేసులు, వివిధ అంశాలపై స్టేషన్ల వారీగా ఎస్పీ రివ్యూ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరిగే చూడాలన్నారు. ప్రతి పోలీసు అధికారి గ్రామాల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి , సమస్యాత్మాక ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలన్నారు. సోషల్ మీడియాపై దృష్టి పెట్టాలని, చెడు ప్రవర్తన కలిగినవారిని బైండోవర్ చేయాలన్నారు.
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను క్లియర్ చేయటానికి స్పెషల్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. ప్రతి కేసులో నాణ్యమైన ఎంక్వైరీ ఉండాలన్నారు. ప్రతి రోజు పోలీసు అధికారులు గ్రామాలను సందర్శిస్తూ రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్లపై అవగాహన కల్పించాలన్నారు. రౌడీ షీటర్స్, అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. వెహికల్స్ను రాష్గా నడిపేవారిపై కేసులు నమోదు చేయాలన్నారు.
పార్ది గ్యాంగులను పట్టుకోవటంతో కీలకపాత్ర పోషిస్తున్న కామారెడ్డి జిల్లా పోలీసులను డీజీపీ అభినందించారని ఎస్పీ తెలిపారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్సీ చైతన్యారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్రావు, విఠల్రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
