
ప్యారిస్: యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. శారీరక వైకల్యం ఉన్న దివ్యాంగులను ఎంపిక చేసి వారిని ఆస్ట్రోనాట్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ‘అందరికీ అంతరిక్షం’ అనే నినాదంతో ముందుకెళ్లాలని భావిస్తున్న ఈఎస్ఏ.. ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈమధ్యే 22 మంది దివ్యాంగ ఆస్ట్రోనాట్లతో కూడిన స్పేస్ ప్రోగ్రామ్కు శ్రీకారం చుట్టిన ఈఎస్ఏ.. వ్యోమగాముల శిక్షణకు అవసరమైన వారి ఎంపిక కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టింది. దీనికి విశేష స్పందన వచ్చింది. 22 వేల మంది దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారు. వందలాది మంది పారా ఆస్ట్రోనాట్లు ఈఎస్ఏకు దరఖాస్తు చేసుకున్నారని సంస్థ చీఫ్ జోసెఫ్ యాష్బాకర్ తెలిపారు. ‘దివ్యాంగ వ్యోమగాములతో ఓ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలని భావిస్తున్నాం. ఇలాంటిది మునుపెన్నడూ జరగలేదు. ఈ విషయంలో ఈఎస్ఏపై మేం చాలా సంతోషంగా ఉన్నాం. అందరికీ అంతరిక్షం అనే స్లోగన్తో మేం ముందుకెళ్తున్నాం’ అని యాష్బాకర్ పేర్కొన్నారు.