- భద్రాచలం ప్రాంతంలో పర్యటించిన పీపీఏ బృందం
భద్రాచలం, వెలుగు: పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఏర్పడే ముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) బృందం తెలిపింది. పీపీఏ సీఈవో సంజీవ్ ఓరా, సెక్రటరీ రఘురాం, చీఫ్ ఇంజినీర్ రమేశ్, డైరెక్టర్ సతీశ్, డిప్యూటీ డైరెక్టర్లు ప్రవీణ్, రవిలతో కూడిన బృందం బుధవారం భద్రాచలంలో పర్యటించింది.
ఐటీసీ పీఎస్పీడీ గెస్ట్హౌస్లో తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లతో సమావేశమై ముంపు సమస్యలపై సమీక్ష నిర్వహించింది. పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 45.72 మీటర్ల కాంటూర్ లెవల్(150 అడుగులు) వరకు చేరితే భద్రాచలం కరకట్టపై ఉన్న ఎనిమిది స్లూయిజ్లలో విస్తా కాంప్లెక్స్, కొత్తకాలనీ ప్రాంతాలతో పాటు విలీన ఎటపాక మండలానికి సంబంధించిన ఒక స్లూయిజ్ పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని ఇరిగేషన్ అధికారులు వివరించారు. నీటిని ఎత్తిపోసేందుకు అధిక సామర్థ్యం గల మోటార్లు అవసరమన్నారు. గోదావరిలో, కిన్నెరసాని పరివాహక ప్రాంతాల్లో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు
