రూల్స్​ను బ్రేక్​ చేసి ఓటర్లకు దర్శనం చేయించిన జీవన్ రెడ్డి

రూల్స్​ను బ్రేక్​ చేసి ఓటర్లకు దర్శనం చేయించిన జీవన్ రెడ్డి
  • యాదాద్రికి 15 స్పెషల్​ బస్సుల్లో 
  • వెయ్యిమందిని తరలించిన ఎమ్మెల్యే జీవన్​రెడ్డి
  • నేరుగా గుట్టపైకి వాహనాలు.. వీఐపీ దర్శనాలు

యాదాద్రి, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు టీఆర్​ఎస్​ నానా ప్రయత్నాలు చేస్తున్నది. చౌటుప్పల్​ మండలం దండు మల్కాపురం ఇన్​చార్జ్​గా ఉన్న ఆర్మూర్​ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి దాదాపు వెయ్యి మంది ఓటర్లను ప్రత్యేక బస్సుల్లో యాదాద్రికి తీసుకెళ్లి.. స్పెషల్​ దర్శనాలు చేయించారు. రూల్స్​ను బ్రేక్​ చేసి నేరుగా కొండపైకి ఆ బస్సులను తరలించారు. జీవన్​రెడ్డి వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతున్నది. దండు మల్కాపురం గ్రామంలో 2 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 1,000 మందిని యాదగిరిగుట్టకు తరలించడానికి హయత్​నగర్​ డిపోకు చెందిన 15 ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే జీవన్​రెడ్డి బుక్​ చేశారు. ఓటర్లకు ఏర్పాట్ల కోసం ఓ పార్చున్​ వెహికల్​ను ఎస్కార్ట్​గా పెట్టారు. గురువారం ఉదయం గ్రామంలో ఓటర్లను బస్సుల్లో ఎక్కించి.. వారితో జీవన్​రెడ్డి ఫొటోలు కూడా దిగారు. 

నిబంధనల ప్రకారం యాదగిరి గుట్టకు వచ్చిన భక్తులు స్థానికంగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సుల్లోనే  కొండపైకి వెళ్లాలి. కానీ, ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు ఓటర్లతో వచ్చిన బస్సులు మాత్రం నేరుగా కొండపైకి వెళ్లాయి. దాదాపు వెయ్యి మందిని  150 రూపాయల వీఐపీ లైన్​లో తీసుకెళ్లి.. స్పెషల్​ దర్శనాలు చేయించారు. దర్శనం అనంతరం అందరికీ అన్నదాన సత్రంలో భోజనాలు ఏర్పాటు చేశారు. అన్నదానం జరుగుతున్న ప్రాంతానికి మీడియా ప్రతినిధులు వెళ్లి ఫొటోలు తీస్తుండగా.. టీఆర్​ఎస్​ కార్యకర్తలు అడ్డుకున్నారు. తమను ఆర్మూర్​ ఎమ్మెల్యే జీవన్​రెడ్డే ఇక్కడికి తీసుకువచ్చారని పలువురు ఓటర్లు మీడియాకు తెలిపారు.