మూసీ నది పునరుద్ధరణపై రేవంత్ సర్కార్ స్పెషల్​ ఫోకస్​

మూసీ నది పునరుద్ధరణపై రేవంత్ సర్కార్ స్పెషల్​ ఫోకస్​
  • 56 కి.మీ. పొడవునా ప్రక్షాళన, గ్రీన్ అర్బన్ పార్క్​ల కోసం సర్కారు కార్యాచరణ
  • విదేశీ పర్యటనలో మూసీ రివర్​ ఫ్రంట్​పై సీఎం రేవంత్​ ప్రత్యేక చర్చలు
  • లండన్​లో థేమ్స్​, దుబాయ్​లో వాటర్​ ఫ్రంట్​ పరిశీలన
  • మూసీ రివర్​ ఫ్రంట్​ కోసం దిగ్గజ కంపెనీలతో సంప్రదింపులు
  • ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా డిజైన్లు రూపొందించాలని అధికారులకు ఆదేశం
  • నేడు ఉదయం హైదరాబాద్​కు సీఎం రేవంత్​ బృందం

హైదరాబాద్, వెలుగు:  మూసీ నది పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. మురికి కూపంగా మారిన నదిని ప్రక్షాళన చేయాలని, పర్యాటక కేంద్రంగా మార్చాలని భావిస్తున్నది. 56 కిలో మీటర్ల పొడవునా మూసీ నది ప్రక్షాళన కోసం, దాని వెంట గ్రీన్​ పార్కులు, షాపింగ్​ కాంప్లెక్స్​ల ఏర్పాటు కోసం యోచిస్తున్నది. విదేశీ పర్యటనలో సీఎం రేవంత్​రెడ్డి ఇదే అంశంపై కీలక చర్చలు చేపట్టారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఆయా దేశాల్లోని నగరాల చుట్టూ ఉన్న నదులు, వాటి డెవలప్​మెంట్​ కోసం తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. 

లండన్  పర్యటనను ముగించు కుని సీఎం రేవంత్​ ఆదివారం దుబాయ్​కి చేరుకున్నారు. అక్కడ  బిజీ బిజీగా గడిపారు. ప్రపంచస్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్ లతో ఆయన వరుసగా భేటీ అయ్యారు.  హైదరాబాద్​లోని మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపైనే కీలక సమావేశాలు నిర్వహించారు. మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్‌‌ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుందని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ఫ్రంట్​ ప్రాజెక్టుకు అపురూపమైన డిజైన్లు, నమూనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. 

దేశంలోని ఇతర సిటీలు, రాష్ట్రాలతో తాము పోటీ పడటం లేదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.  ‘‘చారిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయి. నదులు, సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి” అని అన్నారు.  56 కిలోమీటర్ల పొడవునా మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ పార్క్ లు, షాపింగ్ కాంప్లెక్స్​ల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలు, వాటికి అవసరమైన పెట్టుబడులపై వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. దుబాయ్ లో ఆదివారం వర్కింగ్ డే కావడంతో సీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అర్ధరాత్రి వరకు ఈ సంప్రదింపులు కొనసాగించింది.  

దుబాయ్​ వాటర్​ ఫ్రంట్​ ప్రాజెక్టు సందర్శన

దుబాయ్ పర్యటనలో భాగంగా రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి సీఎం రేవంత్​రెడ్డి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఒక స్కై స్కాపర్ పైకి వెళ్లి ఏరియల్ వ్యూ లా కనిపించే వాటర్ ఫ్రంట్ అందాలను చూశారు.  చుట్టూ నీళ్లు.. పక్కనే ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే అందమైన భవంతులు, నీళ్ల చుట్టూ అందమైన రహదారులతో ఒకదానికొకటి అనుబంధంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు దుబాయ్​లో పర్యాటకులను అందరినీ ఆకట్టుకుంటున్నది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యవహారాలు, దాంతో ముడిపడి ఉన్న సామాజిక ఆర్థిక ప్రభావాలను సీఎం అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పట్టింది.. ఎంత ఖర్చయింది..?  ఏమేం సవాళ్లు ఎదురయ్యాయి..? నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలపై ఆయన చర్చించారు.హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ నిర్మించేందుకు దేశ విదేశాల్లోని వివిధ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రతినిధి బృందం అధ్యయనం చేస్తున్నది. అందులో భాగంగానే సీఎం నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం లండన్​లో థేమ్స్​ రివర్​ ఫ్రంట్​ను, దుబాయ్ లో వాటర్​ ఫ్రంట్​ను సందర్శించింది.

70 సంస్థలతో చర్చలు

దుబాయ్​లో దాదాపు 70 సంస్థలతో సీఎం రేవంత్​ సంప్రదింపులు జరిపారు. ప్రపంచంలోనే పేరొందిన కంపెనీలు.. డిజైన్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో సమావేశమయ్యారు. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి,  మూసీ రివర్ డెవలప్​మెంట్​పై ఆసక్తి చూపాయి. తదుపరి సంప్రదింపులకు త్వరలోనే రాష్ట్రానికి వస్తామని తెలిపాయి. సీఎంతో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ వి.శేషాద్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, సీఎం స్పెషల్ సెక్రెటరీ బి.అజిత్ రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్​మెంట్​  కార్పొరేషన్ ఎండీ ఆమ్రపాలితో పాటు అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు సీఎం హైదరాబాద్​కు చేరుకుంటారు.