
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్ సెగ్మెంట్ సంక్షేమం కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రవేశపెడుతున్నట్లు బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ప్రకటించారు. బుధవారం ఎల్బీనగర్ పార్టీ ఆఫీసులో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేది ఒక్క బీజేపీ మేనిఫెస్టోనే అని తెలిపారు. రాష్ట్ర మేనిఫెస్టోలోని హామీలతో పాటు ప్రత్యేకంగా సెగ్మెంట్ సమస్యల పరిష్కారానికి ఎల్బీనగర్ పబ్లిక్ మేనిఫెస్టో విడుదల చేస్తున్నామన్నారు.
సెగ్మెంట్ మేనిఫెస్టోతో స్థానిక సమస్యల పరిష్కారం సులభమవుతుందన్నారు. చెరువుల కబ్జా, నాలాల సమస్య, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, నిరుపేదలకు సొంతింటి నిర్మాణం, రోడ్డు విస్తరణలో భూమి పోయిన వారికి తగిన న్యాయం చేకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహా రెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి, లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పవన్ కుమార్, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్లెం రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ సెగ్మెంట్ బీజేపీ కన్వీనర్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.