
రాఖీ...అన్నా చెల్లెళ్ల అనుబంధం.. ఆత్మీయ సుగంధం.. అక్క పక్కన తమ్ముడు లేదా అన్న ఉంటే భరోసా.. కంటికి రెప్పలా కాపాడుకుంటాడని చెల్లెలికి అన్నంటే చెప్పలేనంత ప్రేమ. ప్రేమకు ప్రతి రూపాలు అక్కా తమ్ముళ్లు.. అన్నా చెల్లెళ్లు.. వారి అనుబంధానికి ప్రతీక ఈ రక్షాబంధన్. సోదరుడికి ప్రేమతో కట్టే రాఖీ వారి మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను మరింత మెరుగు పరుస్తుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం సోదరి తన సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టి అతని శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంది. సోదరుడు ఆమెకు బహుమతి ఇచ్చి అండగా నిలుస్తానని వాగ్దానం చేస్తాడు. భారతదేశంలోని ఇతర పండుగల మాదిరిగానే, రక్షా బంధన్ చరిత్ర కూడా వివిధ పౌరాణిక ఇతిహాసాల మేళవింపుతో, జానపద కథలతో ముడిపడి ఉంటుంది. రక్షా బంధన్.. ఒక మహిళ తన భర్త మణికట్టుకు దారం కట్టడంతో ప్రారంభమైందా అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది.రక్షా బంధన్ అనేది సోదర ప్రేమకేనా.. పరిమితం కాదని..సోదర ప్రేమతో పాటు మరో ఆసక్తికర పురాణ కథనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
శ్రీకృష్ణుడుకి ... ద్రౌపది
భారతంలో శ్రీకృష్ణుడు లేని ఘట్టాలు చాలా అరుదుగా ఉంటాయి. పాండవులకు రక్షణ కవచంలా నిలిబడిన శ్రీకృష్ణుడు పాండవుల పత్ని ద్రౌపదికి తోడబుట్టినవాడు కాకున్నా ఆమెను అనుక్షణం కాపాడాడు. నిండు సభలో వివస్త్ర కాకుండా ఆమె మానప్రాణాలు కాపాడిన దేవుడు శ్రీకృష్ణుడు. దీని వెనుక ఓ కారణం ఉంది.
దుష్ణ శిక్షణకు ఆవతరించిన దేవాదిదేవుడైన శ్రీ కృష్ణుడు దుర్మార్గాలు చేసే ఛేది రాజ్య చక్రవర్తి అయిన శిశుపాలుడుని సంహరించాలనుకుంటాడు. కృష్ణుడికి మేనత్త అయిన శ్రుతాదేవి కుమారుడే శిశుపాలుడు. అయినా ధర్మం కోసం దుర్మార్గాన్ని అణచటం కోసం కృష్ణుడు సొంత బంధువునే సంహరించటానికి వెనుకాడడు. మేనత్తకు ఇచ్చిన మాట కోసం శిశుపాలుడు 100 తప్పులు పూర్తి అయ్యేవరకు ఆగాలనుకుంటాడు. అలా శ్రీకృష్ణుడు శిశుపాలిడ్ని తన సుదర్శన చక్రంతో సంహరిస్తాడు. అలా సంహరించే సమయంలో శ్రీకృష్ణుడు చేతికి గాయమవుతుంది. దీంతో అక్కడే ఉన్న ద్రౌపది తన చీర కొంగు చింపి కృష్ణుడి గాయానికి కట్టుకడుతుంది. అయితే ఈ వృత్తాతం అంతా శ్రావణ పౌర్ణమి రోజున జరిగిందని కృష్ణ పురాణంలో పేర్కొన్నారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
దాంతో కృష్ణుడు సంతోషపడి..నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి, నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో అంటూ అభయమిస్తాడు. అలా కృష్ణుడు ఇచ్చిన మాటను ద్రౌపది అని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని చెబుతారు. తరువాతి కాలంలో కురు సభలో పాండవులు జూదంలో ఓడిపోవటం..ఆ జూదంలో ద్రౌపదిని కూడా పందెంగా పెట్టటం .... దుర్యోధనుడు ఆదేశంతో దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగి వివస్త్రను చేసే సమయంలో ద్రౌపది వేడుకోలుతో అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు.అలా వీరిద్దరు తోడబుట్టినవారు కాకపోయినా..అన్నగా భావించి రక్షణణు కట్టిన ద్రౌపది..చెల్లెలిని కాపాడిన అన్నగా శ్రీకృష్ణుడు ఘట్టాలు రక్షాబంధన్ కు మూలం అని అంటారు.
బలి చక్రవర్తికి... లక్ష్మీదేవి
మహా పరాక్రమశాలి..దానాలకు మారు పేరుగా నిలిచిన బలి చక్రవర్తికి సాక్షాత్తు ఆదిదేవుడు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి రక్షా బంధన్ కట్టిన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకానొక సందర్భంగా రాక్షస రాజు బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళ్లి.. శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి, తానెవరో తెలిపిందట. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుందట.
సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే తనను సోదరుడిగా భావించి కోరిక కోరితే తీర్చకుండా ఉంటాడా బలి చక్రవర్తి. పైగా దానంలో ఆయన శిభి చక్రవర్తిలాంటివాడు. ఇచ్చిన మాట కోసం తన రక్త మాంసాలనే కోసి ఇచ్చిన మహా దాత శిభి చక్రవర్తి. అంతటి శిభి చక్రవర్తితో సమానుడైన బలి చక్రవర్తి సాక్షాత్తు ఆ నారాయణుడే తన వద్దకు వచ్చి దేహీ అని అడిగితే దానం ఇచ్చిన గొప్ప రాక్షస చక్రవర్తి. అటువంటి బలి వద్దకు ఆ లక్ష్మీదేవి స్వయంగా వెళ్లి రక్ష కట్టి కోరితే ఇవ్వకుండా ఉంటాడా..? అలా బలి చక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.. ఇలా విభిన్న రకాలుగా ‘రాఖీ పౌర్ణమి’ పుట్టిందని చెపుతారు.
వినాయకుడి కుమారులకు... సంతోషిమాత
రాఖీ పండుగ వెనుక పురాణాలలో మరో కథ ఉంది. గణనాధుడు వినాయకుడి కుమార్తెగా సంతోషిమాత ఎలా మారిందో తెలిపే కథ ఒకటుంది. సంతోషి మాత. ఎవరీ సంతోషిమాత..? వినాయకుడి కుమార్తెగా జన్మించటం వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం. సంతోషిమాతను ఉత్తర భారతీయులే ఎక్కువగా పూజిస్తారు. సంతోషిమాత ఆలయాలు దక్షిణాదిలో కంటే ఉత్తరాదిలోనే ఎక్కువగానే ఉన్నాయి.
గణనాధుడు గణేషుడికి సిద్ధి, బుద్ది అనే ఇద్దరు భార్యలున్నారనే విషయం తెలిసిందే. వీరిద్దరే కాకుండా వినాయకుడికి తుష్టి, పుష్టి, శ్రీ అనే మరో ముగ్గురు భార్యలున్నాయని పురాణ కథలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే వినాయకుడికి ఇద్దరు పుత్రులున్నారు. వారి పేర్లు శుభ్, లభ్. వీరికి సోదరి లేదు. దీంతో సోదరీ సోదరుల మధ్య అనుబంధానికి ప్రతీగకగా చెప్పబడిన రక్షా బంధనం తమకు కూడా చేసుకోవాలని ఉందని విఘ్నాలు తొలగించే తండ్రి అయని ఆ విఘ్నేశ్వరుడిని కోరుతారు.
అయితే తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడట. ఆ జ్యోతిగా వెలువడి బాలిక రూపం ధరించింది. ఆ తర్వాత గణేష పుత్రులైన శుభ్, లభ్ లకు రాఖీ కట్టింది.అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కల్గించింది కాబట్టి ఆమెకు సంతోషీ దేవతగా, సంతోషీ మాతగా మారినట్లు చెబుతుంటారు.
రక్షా బంధన్ వేడుకలు వేద యుగంలో ప్రారంభమైనా కానీ ఈ సంప్రదాయాన్ని దేశంలో సోదర సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తున్నారు. సాధారణ రాఖీల నుండి విదేశాలలో ఉన్న సోదరులకు పంపించే ఆధునిక ఇ-రాఖీల వరకు రక్షా బంధన్ బాగా అభివృద్ధి చెందింది. బంధాలను బలోపేతం చేస్తూనే ఉంది. కాలం మారుతున్న కొద్దీ, సోదరీమణులు తమ తోబుట్టువులకు రాఖీలు కట్టడం మాత్రమే కాదు, కొంతమంది తమకు తాము ధరించడం కూడా కనిపిస్తుంది.