- బేస్ ప్రైస్ రూ. 96,317.65 కోట్లు
న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ వేలం ఈ ఏడాది మే 20 న ప్రారంభమవుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం శుక్రవారం ప్రకటించింది. అప్లికేషన్లను ఆహ్వానించింది. మొబైల్ ఫోన్ సర్వీల కోసం మొత్తం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్లను ప్రభుత్వం వేలం వేయనుంది. వీటి బేస్ ప్రైస్ రూ.96,317.65 కోట్లు. దివాలా తీసిన కంపెనీల దగ్గర ఉన్న స్పెక్ట్రమ్ను ఆక్షన్లో అమ్మకానికి పెట్టనున్నారు. ఈ ఏడాది మేలో జరిగే వేలంలో 800, 900, 1,800 ,2,100, 2,500, 3,300, 26 గిగా హెడ్జ్ బ్యాండ్స్లోని స్పెక్ట్రమ్ను ప్రభుత్వం అమ్మనుంది.
ఈసారి డిమాండ్ పెద్దగా ఉండకపోవచ్చని డాట్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది స్పెక్ట్రమ్ ఆక్షన్లో టెలికం కంపెనీలు పెద్దగా ఖర్చు చేయకపోవచ్చని టెలికం సెక్రటరీ నీరజ్ మిట్టల్ తాజాగా జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో పేర్కొన్నారు. గత ఆక్షన్లో భారీగా ఖర్చు చేయడమే ఇందుకు కారణమని చెప్పారు. ఈసారి వేలంలో కొన్ని సర్కిల్స్లో స్పెక్ట్రమ్ రెన్యువల్ కోసం కంపెనీలు పాల్గొనవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల రెవెన్యూ పొందుతుందని అంచనా వేయొద్దని ఆయన అన్నారు.
రానున్న ఆక్షన్లో ప్రభుత్వ టార్గెట్ రూ.1.5 లక్షల కోట్ల కంటే తక్కువ ఉందని చెప్పారు. 2022 లో జరిగిన 5జీ ఆక్షన్లో ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లు సేకరించింది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఎక్స్పైరీ కానున్న 4జీ బ్యాండ్స్1,800, 900 మెగాహెడ్జ్లోని స్పెక్ట్రమ్ లైసెన్స్ను రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది. రెన్యువల్కు ఎయిర్టెల్ రూ.4,200 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.1,950 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.