
హైదరాబాద్: శంషాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వైజాగ్ బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానం ఇంకా కదలడం లేదు. 80 మంది ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ లోనే పడిగాపులు కాస్తున్నారు. ఎంతకు విమానం కదలకపోవడంతో వారు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్పైస్ జెట్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. తాము గంటల తరబడి వెయిట్ చేస్తున్నా.. సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు సీరియస్ అయ్యారు.
టెక్నికల్ సమస్యలు తలెత్తిన కారణంగానే విమానం ఆగిపోయిందని స్పైస్జెట్ సిబ్బంది తెలిపారు. టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంటే మరో ఫ్లైట్ ఏర్పాటు చేయాల్సింది అంటూ గొడవకు దిగారు ప్రయాణికులు. ప్రయాణికుల్లో కొంతమంది వైజాగ్ లో జరిగే RBI పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఫ్లైట్ ఆలస్యం కారణంగా తాము పరీక్ష రాయలేకపోయామంటున్నారు. విమాన సంస్థ మరో ఫ్లైట్ ఏర్పాటు చేస్తుందా..లేదా ఇవాళ్టికి విమానాన్ని క్యాన్సిల్ చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.