
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో జీఎస్టీ ఎగవేసినట్లు గుర్తించిన సంస్థలపై కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్చర్యలు తీసుకుంటున్నది. మొన్న బిగ్లీప్ టెక్నాలజీస్ పై చర్యలు తీసుకోగా.. తాజాగా శ్రీ కావ్య మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై కొరడా ఝుళిపించింది. అందుకు సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే. శ్రీదేవి మీడియాకు తెలిపారు.
శ్రీ కావ్య మైనింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెట్ అనే కంపెనీని రూప్ సింగ్ నాయక్ 2021లో ఏర్పాటు చేశారు. సరూర్నగర్ సర్కిల్ పరిధి చంపాపేట్లో సంస్థను ఏర్పాటు చేసి జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. అయితే, వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండానే బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి పలు సంస్థలకు ఇచ్చారు.
అదే విధంగా మహారాష్ట్ర నాగపూర్ లోని పలు సంస్థలకు రూ.100 కోట్ల టర్నోవర్కు సంబంధించిన ఇన్వాయిస్లు అందజేశారు. ఇందుకు సంబంధించి మొత్తం రూ.18.55 కోట్ల జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారని శ్రీదేవి వివరించారు. ఆ ఇన్వాయిస్లు, ఇన్ ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ను ఇతర కంపెనీలకు బదిలీ చేసినట్లు గుర్తించామన్నారు. రూప్సింగ్ నాయక్ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించారని చెప్పారు. ప్రస్తుతం అతడిని చంచల్గూడ జైలుకు తరలించి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని శ్రీదేవి వివరించారు.