- సూపర్ సిక్స్లో 9 వికెట్లతో జింబాబ్వేపై గెలుపు
- నిశాంక సెంచరీ, తీక్షణకు 4 వికెట్లు
బులావయో (జింబాబ్వే) : రెండు సార్లు వరల్డ్ చాంపియన్ వెస్టిండీస్ క్వాలిఫయర్స్లోనే నిష్ర్కమించినా.. మాజీ విన్నర్ శ్రీలంక వరల్డ్ కప్ బెర్తు దక్కించుకుంది. క్వాలిఫయర్స్ టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా దూసుకెళ్తున్న లంక మరో మ్యాచ్ మిగిలుండగానే ఇండియాలో జరిగే మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యింది. పాథుమ్ నిశాంక (102 బాల్స్లో 101 నాటౌట్) సెంచరీ, స్పిన్నర్ మహేశ్ తీక్షణ (4/25) మ్యాజిక్ స్పెల్తో సత్తా చాటడంతో ఆదివారం జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. తొలుత ఆతిథ్య జింబాబ్వే32.2 ఓవర్లలో 165 రన్స్కే ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (56), సికందర్ రజా (31) తప్ప మిగతా ప్లేయర్లంతా నిరాశ పరిచారు. లంక బౌలర్లు తీక్షణ, దిల్షాన్ మదుషంక (3/15), మతీష పతిరణ (2/18) దెబ్బకు బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు.
అనంతరం నిశాంక సెంచరీ జోరుతో లంక 33.1 ఓవర్లలోనే 169/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. దిముత్ కరుణరత్నె (30), కుశాల్ మెండిస్ (25 నాటౌట్) కూడా రాణించారు. తీక్షణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో లంక 8 పాయింట్లతో ఈ టోర్నీలో ఫైనల్తో వరల్డ్ కప్కు అర్హత సాధించింది. ఇంకో బెర్తు కోసం జింబాబ్వే, స్కాట్లాండ్ జట్ల మధ్య పోటీ ఉంది. స్కాట్లాండ్తో మ్యాచ్ ఆడాల్సిన జింబాబ్వే 6 పాయింట్లతో రెండో ప్లేస్లో ఉంది. రెండు మ్యాచ్లు మిగిలున్న స్కాట్లాండ్ 4 పాయింట్లతో నిలిచింది. స్కాట్లాండ్, జింబాబ్వే మధ్య మ్యాచ్తో రెండో బెర్తు తేలనుంది.
అలవోకగా..
ఈ టోర్నీ స్టార్టింగ్ నుంచి సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్న లంక బౌలర్లు ఈ పోరులోనూ అదే జోరు చూప్టెటారు. టాస్ నెగ్గిన కెప్టెన్ దసున్ షనక బౌలింగ్ ఎంచుకోగా.. అతని నిర్ణయానికి పూర్తి న్యాయం చేశారు. తొలుత పేసర్ మదుషంక జింబాబ్వే టాపార్డర్ పని పడితే.. తీక్షణ మిడిలార్డర్ను దెబ్బకొట్టాడు. ఓపెనింగ్ స్పెల్లో నిప్పులు చెరిగిన మదుషంక ఇన్నింగ్స్ ఐదో బాల్కే ఓపెనర్ గుంబీ (0)ని డకౌట్ చేసిఅతిథ్య జట్టుకు షాకిచ్చాడు. ఆపై వెంటవెంటనే వెస్లే మధెవెరె (1), క్రెయిగ్ ఎర్విన్ (14)ను ఔట్ చేయడంతో జింబాబ్వే 30/3తో డీలా పడింది. ఈ దశలో సీన్ విలియమ్స్, సికందర్ రజా నాలుగో వికెట్కు 68 రన్స్ జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, షనక వేసిన 20వ ఓవర్లో పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో రజా క్యాచ్ ఔట్ కావడంతో లంకకు కీలక బ్రేక్ లభించింది. ధనంజయ డిసిల్వా వేసిన తర్వాతి ఓవర్లో సీన్ విలియమ్స్ మూడు సిక్సర్లతో రెచ్చిపోవడంతో జింబాబ్వే మంచి స్కోరు చేసేలా కనిపించింది.
ఈ టైమ్లో మళ్లీ బౌలింగ్కు వచ్చిన తీక్షణ మ్యాజిక్ చేశాడు. మంచి టర్నింగ్ బాల్స్తో విలియమ్స్, ర్యాన్ బర్ల్ (16)ను క్లీన్ బౌల్డ్ చేసిన అతను లూక్ జాంగ్వే (10)ను ఎల్బీ చేశాడు. దాంతో, 124/4తో ఉన్న జింబాబ్వే ఒక్కసారిగా 144/7తో కష్టాల్లో పడింది. కాసేపటికే పతిరణ నాలుగు బాల్స్ తేడాతో బ్రాడ్ ఎవాన్స్ (14), ఎన్గరావ (0)ను వెనక్కిపంపగా... తీక్షణ బౌలింగ్లో ముజరబాని (0) బౌల్డ్ అవ్వడంతో జింబాబ్వే ఆలౌటైంది. ఇక, చిన్న టార్గెట్ ఛేజింగ్లో ఓపెనర్ నిశాంక సూపర్ సెంచరీతో శ్రీలంక ఈజీగా టార్గెట్ను కరిగించింది. మూడో ఓవర్లోనే క్యాచ్ ఔట్ తప్పించుకున్న కరుణరత్నెతో తొలి వికెట్కు 103 రన్స్ జోడించిన నిశాంక.. రెండో వికెట్కు కుశాల్ మెండిస్తో 66 రన్స్ జోడించి టీమ్కు వరల్డ్ కప్ బెర్తు సాధించి పెట్టాడు.