
భద్రాచలం,వెలుగు: జులై 10న దమ్మక్క సేవాయాత్రను నిర్వహించనున్నట్లు శ్రీసీతారామచంద్రస్వామి వైదిక కమిటీ సోమవారం వెల్లడించింది. ఆషాఢ మాసంలో నిర్వహించే ఉత్సవాల షెడ్యూల్ను రిలీజ్చేశారు. జూన్27న పునర్వసు సందర్భంగా స్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సంధ్యాహారతి, తిరువీధి సేవ, 28న పుష్యమి వేళ శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించారు. జులై 4న చిత్తా నక్షత్రం సందర్భంగా యాగశాలలో సుదర్శన హోమం, 5న స్వాతి నక్షత్రం వేళ శ్రీపెరియాళ్వార్ తిరునక్షత్రం, స్నపన తిరుమంజనం, రాత్రి ఆళ్వార్చుట్టుసేవ, 6న తొలిఏకాదశి శ్రీసీతారామచంద్రస్వామికి తిరువీధి సేవ, 10న గురుపూర్ణిమ దమ్మక్క సేవ యాత్ర , గోవిందరాజస్వామికి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం, తిరువీధి సేవ జరపాలని వైదిక కమిటీ పేర్కొంది.
జులై 21 సర్వ ఏకాదశిన లక్ష కుంకుమార్చన, తిరువీధి సేవ, 24న అమావాస్య పునర్వసున ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఉంటాయన్నారు. సోమవారం శ్రీసీతారామచంద్రస్వామికి ముత్తంగి సేవను వైభవంగా చేశారు. సుప్రభాతసేవ అనంతరం గర్భగుడిలో మూలవరులు, ఉత్సవమూర్తులు, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామిలకు ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి ముత్తంగి సేవను నిర్వహించారు. ప్రత్యేక హారతులు సమర్పించాక, నివేదన చేసి, కల్యాణమూర్తులకు బేడా మండపంలో నిత్య కల్యాణం జరిపారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.