
- ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
ఖమ్మం టౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను పారదర్శకంగా కేటాయించాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సమస్య రాకుండా మండలాల వారీగా ఎక్కడి నుంచి ఇసుక తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించి ఇసుక రీచ్ లను కేటాయించిందన్నారు.
మండలాల్లో ఎక్కడైనా ఇసుక తరలించే పాయింట్ అందుబాటులో ఉంటే, ఆ వివరాలను తహసీల్దార్ కు అందించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడికి హౌజింగ్ శాఖ ఏఈ నుంచి ఏ సమయంలో ఎన్ని ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉంటుందో వివరాలతో లేఖ అందించాలన్నారు.
ఆ లేఖ ఆధారంగా తహసీల్దార్ కూపన్ జారీ చేస్తారని, ఆ కూపన్ తో 3 రోజుల్లో ఇసుక తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అవసరమైన వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. స్వశక్తి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇసుక రీచ్ లు నిర్వహిస్తున్నామని, ప్రతీ ట్రాక్టర్ లోడ్ ఇసుకకు రూ.200 తహసీల్దార్ కార్యాలయం వద్ద చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
రూ.200 ల్లో సగం మహిళా సంఘాలకు, మిగత రూ.50 గ్రామ పంచాయతీకి, మరో.50 గ్రామీణ అభివృద్ధి శాఖకు వెళ్తాయని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక రీచ్ ల నుంచి ఇసుక తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
విపత్తు నిర్వహణ సామగ్రి ఏర్పాటుకు చర్యలు
విపత్తు నిర్వహణ కోసం అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచుతామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. టార్చ్ లైట్, లైఫ్ జాకెట్, స్పీకర్ మైక్ సెట్స్, బోట్లు, జిప్ కవర్, గజ ఈతగాళ్లకు ఎంత వరకు అందుబాటులో ఉన్నాయో పరిశీలించాలన్నారు. ప్రతీ 15 రోజులకు ఒకసారి మండల స్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆపద మిత్ర, గజ ఈతగాళ్లతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలని చెప్పారు.
జిల్లాలో 24 సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్, 24 సభ్యులతో కూడిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో సన్యాసయ్య, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా మైనింగ్ అధికారి సాయినాథ్, ఆర్డీవోలు నరసింహా రావు, ఎల్. రాజేందర్, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, హౌజింగ్ ఏఈలు, అధికారులు పాల్గొన్నారు.