- స్టార్ బాక్సర్ హుస్సాముద్దీన్
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ బాక్సర్, తెలంగాణ ఆటగాడు మహ్మద్ హుస్సాముద్దీన్ కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. గడిచిన పది నెలల్లో కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ చాంపియన్షిప్స్, మెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో మూడు బ్రాంజ్ మెడల్స్తో సత్తా చాటాడు. తాష్కెంట్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్లో తొలి ప్రయత్నంలోనే మెడల్ గెలిచిన హుస్సామ్.. కూతురు పుట్టాక తనకు అదృష్టం వచ్చిందని చెబుతున్నాడు. ఇదే జోరుతో మున్ముందు మరింత సత్తా చాటుతానని అంటున్నాడు. ‘గతేడాది కామన్వెల్త్ గేమ్స్ కోసం బెల్ఫాస్ట్లో నేను ట్రెయినింగ్లో ఉన్న టైమ్లో మా పాప పుట్టింది. ఆమె నాకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని నాకు అప్పుడే తెలుసు. చాన్నాళ్ల తర్వాత వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్కు సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషపడ్డా.
అదే టైమ్లో ఎలాగైనా మెడల్ నెగ్గాలని భావించా. ఇదివరకు రెండు, మూడు సార్లు ఈ టోర్నీలో పాల్గొనే చాన్స్ మిస్సయ్యాను కాబట్టి నన్ను నేను నిరూపించుకోవాల్సి వచ్చింది’ అని నిజామాబాద్ బాక్సర్ చెప్పుకొచ్చాడు. క్వార్టర్ఫైనల్లో మోకాలికి గాయం కాకపోయి ఉంటే టోర్నీలో మరింత దూరం వెళ్లేవాడినని హుస్సామ్ తెలిపాడు. ‘క్వార్టర్స్ బౌట్ చివరి 10 సెకండ్లలో ప్రత్యర్థి నన్ను నెట్టేయడంతో బ్యాలెన్స్ కోల్పోయా. తర్వాతి రోజు ట్రెయినింగ్లో పంచ్లు కొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సరిగ్గా నిలబడలేకపోయాను. పోటీ నుంచి తప్పుకోవాల్సి రావడంతో చాలా నిరుత్సాహానికి గురయ్యా’ అని హుస్సామ్ తెలిపాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆసియా గేమ్స్ కోసం హుస్సామ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయనున్నాడు.