2022 స్పోర్ట్స్‌ అవార్డుల విన్నర్లను  ప్రకటించిన మినిస్ట్రీ

2022 స్పోర్ట్స్‌ అవార్డుల విన్నర్లను  ప్రకటించిన మినిస్ట్రీ

న్యూఢిల్లీ:  నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌, ఇంటర్నేషనల్‌‌‌‌ ఈవెంట్లలో పతకాల మోత మోగిస్తూ తెలంగాణకు పేరు తెస్తున్న స్టార్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ నిఖత్‌‌‌‌ జరీన్‌‌‌‌, టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ స్టార్‌‌‌‌ ఆకుల శ్రీజ టాలెంట్​కు తగిన గుర్తింపు లభించింది. ఈ ఇద్దరికి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది.  టీటీ లెజెండ్‌‌‌‌ ఆచంట శరత్‌‌‌‌ కమల్‌‌‌‌ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌‌‌‌రత్న అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు  సెంట్రల్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ మినిస్ట్రీ  2022కి గాను స్పోర్ట్స్‌‌‌‌ అవార్డు విన్నర్ల  లిస్ట్‌‌‌‌ను సోమవారం ప్రకటించింది. మొత్తం 25 మంది అథ్లెట్లు అర్జునకు ఎంపికయ్యారు. ఈ సారి ఖేల్‌‌‌‌రత్న శరత్‌‌‌‌ను మాత్రమే వరించింది.  అర్జునకు ఎంపికైన వారిలో నిఖత్‌‌‌‌, శ్రీజతో పాటు చెస్‌‌‌‌ సంచలనం ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద, బ్యాడ్మింటన్‌‌‌‌ ప్లేయర్లు లక్ష్యసేన్‌‌‌‌, హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రణయ్‌‌‌‌ కూడా ఉన్నారు.

కోచింగ్‌‌‌‌లో విశేష కృషి చేసినందుకు జీవన్‌‌‌‌జోత్ సింగ్  (ఆర్చరీ), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్), సుమా  షిరూర్ (పారా షూటింగ్), సుజీత్ మాన్ (రెజ్లింగ్)కు ద్రోణాచార్య అవార్డులు లభించాయి. లైఫ్‌‌‌‌ టైమ్‌‌‌‌ కేటగిరీలో మరో ముగ్గురు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. సీనియర్​ ప్లేయర్లు అశ్విని అక్కుంజి (అథ్లెటిక్స్), ధరమ్‌‌‌‌వీర్ సింగ్ (హాకీ), ​​బి సి సురేష్ (కబడ్డీ), నిర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్)కు లైఫ్​ టైమ్​ కేటగిరీలో ధ్యాన్​ చంద్​ అవార్డు లభించింది. వీళ్లంతా ఈ నెల 30వ తేదీన రాష్ట్రపతి భవన్‌‌‌‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో  ప్రెసిడెంట్‌‌‌‌ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకుంటారు.

ఇద్దరూ ఇద్దరే

అర్జున అవార్డుకు ఎంపికైన నిఖత్‌‌‌‌ జరీన్‌‌‌‌, ఆకుల శ్రీజ  కొన్నాళ్లుగా సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఈ ఇద్దరికి బాగా కలిసొచ్చింది. స్ట్రాంజా మెమోరియల్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ నెగ్గడంతో మొదలైన నిఖత్‌‌‌‌ జోరు.. మొన్నటి కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో  బంగారు  పతకం వరకు కొనసాగింది. మధ్యలో వరల్డ్‌‌‌‌ బాక్సింగ్​ చాంపియన్‌‌‌‌ అవడంతో నిఖత్‌‌‌‌ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. 52 కేజీల వెయిట్‌‌‌‌ కేటగిరీలో మేటి బాక్సర్లను మట్టి కరిపిస్తూ  గోల్డ్‌‌‌‌ నెగ్గిన నిఖత్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌లో ఈ ఘనత సాధించిన ఇండియా ఐదో విమెన్‌‌‌‌ బాక్సర్‌‌‌‌గా నిలిచింది. లెజెండరీ బాక్సర్లు మేరీకోమ్‌‌‌‌, సరితా దేవి సరసన నిలిచింది.

ఆపై, కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో కొత్త వెయిట్‌‌‌‌ కేటగిరీ (50 కేజీ)కి మారినా తన పంచ్‌‌‌‌ పవర్‌‌‌‌ చూపెట్టి ఔరా అనిపించింది. మరోవైపు టీటీలో నిలకడగా రాణిస్తున్న శ్రీజ కూడా ఈ ఏడాది అందరి దృష్టిని ఆకర్షించింది. ఏప్రిల్‌‌‌‌లో జరిగిన నేషనల్స్‌‌‌‌లో విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌తో పాటు డబుల్స్‌‌‌‌లో చాంపియన్‌‌‌‌ అయ్యింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. సింగిల్స్‌‌‌‌లో ఇండియా నుంచి టాప్​  ర్యాంక్‌‌‌‌లో ఉన్న శ్రీజ కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో మరింత పేరు తెచ్చుకుంది. శరత్‌‌‌‌ కమల్‌‌‌‌తో కలిసి బరిలోకి తను మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ నెగ్గి శభాష్‌‌‌‌ అనిపించుకుంది. 2024పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌  లక్ష్యంగా నిఖత్‌‌‌‌, శ్రీజ ముందుకెళ్తున్నారు.