మైనింగ్​లోకి రండి.. స్టార్టప్​లకు మైనింగ్​ సెక్రటరీ పిలుపు

మైనింగ్​లోకి రండి.. స్టార్టప్​లకు మైనింగ్​ సెక్రటరీ పిలుపు

న్యూఢిల్లీ: మైనింగ్​ రంగంలో చాలా బిజినెస్​ అవకాశాలున్నాయని, ఏటా 7 బిలియన్​ డాలర్ల విలువైన ప్రొడక్షన్​ జరుగుతోందని మైనింగ్​ సెక్రటరీ వివేక్​ భరద్వాజ్​ చెప్పారు. ఈ సెక్టార్లో చాలా టెక్నాలజీ సవాళ్లున్నాయని, ఇది స్టార్టప్​లకు మంచి అవకాశమవుతుందని ఆయన అన్నారు. ఈ అవకాశాలను స్టార్టప్​లు అందిపుచ్చుకోవాలని వివేక్​ భరద్వాజ్​ పిలుపు ఇచ్చారు. ఐరన్​ ఓర్​ ప్రొడక్షన్​లో గ్లోబల్​గా మన దేశం నాలుగో ప్లేస్​లోనూ, బాక్సైట్​లో అయిదవ ప్లేస్​లోనూ నిలుస్తోందని పేర్కొన్నారు. అయినా కూడా ఈ రంగంలోకి స్టార్టప్​కంపెనీలు రావడం లేదని, ఎక్కువగా ఫిన్​టెక్​, ఎడ్యుటెక్​, ఈ–కామ్​ వంటి రంగాలపైనే దృష్టి పెడుతున్నాయని చెప్పారు.

మొదటిసారిగా తలపెడుతున్న స్టార్టప్​ సమ్మిట్​లోగోను ఆయన లాంఛ్​ చేశారు. వర్షాలు పడేటప్పుడు, పొగ మంచు కమ్మినప్పుడు మైనింగ్​ చేయడం కష్టతరమవుతుందని, అలాంటప్పుడు మైనింగ్​ వర్కర్లతో కమ్యూనికేషన్​ కూడా సాధ్యమవదని చెబుతూ, ఇలాంటి సవాళ్లను అవకాశాలుగా స్టార్టప్​ కంపెనీలు మలుచుకోవచ్చని సూచించారు. ఆ సవాళ్లకు సరయిన టెక్నాలజీ సొల్యూషన్స్​ తేవచ్చని చెప్పారు. క్రోమైట్​ నుంచి నికెల్​ను వేరు చేయడానికి అవసరమైన టెక్నిక్స్​ కూడా డెవలప్​ చేయడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు.

సమ్మిట్​లో పాల్గొనే వారితో సెక్రటరీ కలిసి మాట్లాడనున్నారు. వివిధ మినరల్స్​ ప్రొడక్షన్​ పెంచేందుకు ఏ విధంగా స్టార్టప్​లు సాయపడగలవో తెలుసుకోనున్నారు. ముంబైలో ఈ నెల 29 న మైనింగ్​ స్టార్టప్​ సమ్మిట్​ నిర్వహించనున్నట్లు జాయింట్​ సెక్రటరీ ఫరీదా ఎం నాయక్​ వెల్లడించారు. ఐఐటీ ముంబైతో కలిసి ఈ సమ్మిట్​ నిర్వహిస్తున్నామని అన్నారు. సమ్మిట్​లో 150 దాకా స్టార్టప్​లు పాల్గొంటున్నాయని, మైనింగ్​ సెక్టార్లో కొత్త తరహా బిజినెస్​లను ఆ స్టార్టప్​లు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాయని కూడా ఫరీదా వెల్లడించారు.