పోలింగ్ శాతం తగ్గుతూ పోతే నిర్బంధ ఓటు రావొచ్చు!

పోలింగ్ శాతం తగ్గుతూ పోతే నిర్బంధ ఓటు రావొచ్చు!
  • ఆ దిశగా డిమాండ్లు కూడా ఉన్నాయి.. ‘వెలుగు’ ఇంటర్వ్యూలో రాష్ట్ర సీఈవో వికాస్​ రాజ్​
  • మన భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును వాడుకోకపోతే ఎట్ల? 
  • పోలింగ్​ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నం
  • లీడర్ల స్పీచ్​లపై చాలా ఫిర్యాదులు వస్తున్నయ్​
  • వాటిపై రిపోర్టులు తెప్పించుకొని ఈసీకి పంపిస్తున్నామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు : లిటరసీ, డెవలప్​మెంట్​ పెరిగితే  కుల, మత ప్రస్తావన లేకుండా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్​ రాజ్​ అన్నారు. గతంతో చూస్తే ఇప్పటికే ఓటర్లలో చైతన్యం పెరిగిందని.. ఎన్నికకు ఎన్నికకు ఈ వ్యత్యాసం కనిపిస్తున్నది తెలిపారు. పదేండ్ల తర్వాత కేవలం డెవలప్మెంట్​ ఎజెండాగా ఎన్నికల ప్రచారం జరగొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటు హక్కు ఉండి కొంతమంది వినియోగించుకోవడం లేదని.. ఇట్లయితే భవిష్యత్​లో ‘తప్పనిసరి ఓటింగ్​(నిర్బంధ ఓటు)’ అంశం తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశంలో అయినా, రాష్ట్రంలో  అయినా పొలిటికల్​ పార్టీలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న టఫ్​ పైట్​ ఆధారంగా ఎన్నికల ఖర్చు విపరీతంగా పెడుతున్నట్లు ఈసీ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్​ శాతం, క్యాంపెనియింగ్​ అంశాలపై సీఈవో వికాస్​ రాజ్​ ‘వెలుగు’కు శుక్రవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. 

పోలింగ్​ శాతం పెంచేందుకు ప్రయత్నిస్తున్నం

‘‘రాష్ట్రంలో ఓటర్ల నమోదు సక్సెస్​ఫుల్​గా చేశాం. ఇప్పుడు తెలంగాణలో 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 71.34 శాతం పోలింగ్​ నమోదైంది. ప్రతిసారి టార్గెట్​ వందశాతం పెట్టుకుంటాం. లోక్​సభ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఓటింగ్​ శాతాన్ని దాటాలని అనుకుంటున్నాం.  దాంతో పాటు ఈసారి ఏపీలో కూడా 13వ తేదీనే పోలింగ్​ ఉండటం ఇక్కడి పోలింగ్​ శాతంపై కొంత ఎఫెక్ట్​ చూపిస్తుంది. రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నవాళ్లు కొంతమంది ఉంటే ఉండవచ్చు. అయితే వారంతా రెండు చోట్ల ఓటు వేసే అవకాశం అయితే లేదు. దాంతో పాటు ఎండాకాలం కావడం కొంత మైనస్​. అయినప్పటికీ ఎండల ప్రభావం దృష్ట్యా ఈసీ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​కు అవకాశం ఇచ్చింది. మేం కూడా 35 వేల  పోలింగ్​ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటరు స్లిప్పుల పంపిణీ కూడా దాదాపు పూర్తి చేశాం” అని సీఈవో వికాస్​రాజ్​ అన్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్​ అంతగా ఉండటం లేదని, ఓటు అనేది ఆయుధం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన కోరారు. ‘‘పోలింగ్​ కేంద్రానికి వచ్చి 10 నిమిషాలు ఓటు వేసేందుకు బద్ధకమా? ఐదేండ్ల భవిష్యత్​ కదా.. ఓటర్లు ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? ఇలాగే ఉంటే.. భవిష్యత్​లో ఓటు వేయడం తప్పనిసరి చేస్తారేమో అనిపిస్తుంది. ఆ దిశగా డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈసీ కూడా ఓటింగ్​ను పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఇతర దేశాల్లో ఓటింగ్​ సరళిని అధ్యయనం చేస్తున్నది. ఎలాంటి అవకతవకలు లేకుండా ఒక ఓటరు తన ఓటును ఎక్కడి నుంచైనా క్యాస్ట్​ చేసేలా ఉంటే బాగుంటుందనే ఆలోచన కూడా ఉంది. ఇవన్నీ ఇంకా చర్చలు, ఆలోచనల్లోనే ఉన్నాయి” అని వికాస్​రాజ్​ తెలిపారు. 

లీడర్ల స్పీచ్​లపై చాలా కంప్లయింట్స్​

శనివారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలకు ప్రచారం ముగుస్తుందని వికాస్​రాజ్​ చెప్పారు.  ‘‘ప్రచారంలో వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే విధంగా  ప్రసంగాలు ఉండొద్దు.  కానీ ఈ మధ్య కాలంలో  ప్రచారం దారి తప్పుతున్నట్లు కనిపిస్తున్నది. ఈసీకి, సీఈవో కార్యాలయానికి లీడర్ల ప్రసంగాలపై చాలా కంప్లయింట్స్​ వస్తున్నాయి. వాటి మీద క్షేత్రస్థాయి రిపోర్ట్ తెప్పించుకుని ఈసీకి పంపుతున్నాం. అందుకు తగ్గట్టుగానే ఈసీ చర్యలు తీసుకుంటుంది. మతం, కులం పేరుతో ఓట్లు అడగడం, ప్రచారం చేయడానికి వీల్లేదు. అలా కూడా చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఎప్పుడైతే లిటరసీ పెరిగి.. డెవలప్మెంట్​ పెరిగితే  ఓటర్లలో ఇంకా చైతన్యం పెరుగుతుంది. అలాంటప్పుడు ఒకవేళ పొలిటికల్​ లీడర్లు, పోటీలో ఉండే క్యాండిడేట్లు మతం పేరుతో, కులం పేరుతో ప్రచారం చేసినా.. ఓట్లు అడిగినా లాభం ఉండదు. ఇంకో పదేండ్ల తర్వాత కేవలం డెవలప్​మెంట్​ ఎజెండాగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని నా అంచనా” అని ఆయన పేర్కొన్నారు. ఎక్కడైనా సరే ఈసీ నిర్దేశించిన దానికంటే అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేసినట్లు తేలితే వాళ్లు డిస్​క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ‘‘పార్లమెంట్​ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఖర్చు చేసేందుకు రూ.90 లక్షల లిమిట్​ ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా 34 మంది ఎన్నికల వ్యయ పరిశీలకులు, 17 మంది జనరల్​ అబ్జర్వర్స్​ అంతా మానిటర్​ చేస్తున్నారు” అని ఆయన వివరించారు.