
- స్వీట్ షాపుల్లో ఈగలు వాలిన ఆహార పదార్థాలు
- రూల్స్ పాటించని షాపులు, హోటళ్లకు నోటీసులు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలోని పలు రెస్టారెంట్లు, పచ్చళ్ల తయారీ సెంటర్లు, స్వీట్స్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం శుక్రవారం దాడులు నిర్వహించింది. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్ రెడ్డి, స్వాతి, శ్రీషిక, లోకేశ్, శరత్ తో కూడిన బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. వైరా రోడ్ లో ఉన్న పీఎస్కే ఫుడ్స్ అండ్ స్పైసెస్, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్న జీపీ రెడ్డి ఘీ స్వీట్ షాప్, ఐబాకో ఐస్ క్రీమ్ యూనిట్, పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆహార పదార్థాలపై ఈగలు వాలి ఉండడం, అపరిశుభ్ర వాతావరణంలో పదార్థాల తయారీ, విచ్చలవిడిగా ఫుడ్ కలర్ల వినియోగం, ఫ్రిడ్జ్ లలో సరైన టెంపరేచర్ లేకపోవడం లాంటి పలు లోపాలను గుర్తించి ఆయా షాపులు, బేకరీలకు నోటీసులు అందించారు. ఆహార పదార్థాల శాంపిల్లను సేకరించి, పరీక్షల నిమిత్తం హైదరాబాద్ల్యాబ్ కు పంపించారు.
ఎక్కడెక్కడ ఏ పరిస్థితి..?
- పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్ లో వంట గది అపరిశుభ్రంగా ఉండడం, రిఫ్రిజిరేటర్, కోల్డ్ ఛాంబర్ లలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మెయిన్ టైన్ చేయకపోవడం, సుమారు రూ.2 వేల విలువైన 8 లీటర్ల కాలం చెల్లిన ఫ్రూట్ క్రషెస్, సుమారు రూ.19 వేల విలువ గల 40 కిలోల జీడిపప్పు, షాజీరా, నూడిల్స్, ఇతర ముడి సరుకులపై లేబుల్ సరిగాలేకపోవడం, అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన కూరగాయలను గుర్తించారు. హోటల్ యాజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ జ్యోతిర్మయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చట్టాన్ని ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేశారు. ఆహారపదార్థాలను ధ్వంసం చేశారు.
- వైరా రోడ్ లో గల పీఎస్కే ఫుడ్స్ అండ్ స్పైసెస్ లో విస్తృత తనిఖీలు చేయగా ఫుడ్ హ్యాండ్లర్స్ ఎటువంటి పరిశుభ్రత ప్రమాణాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, తయారీ కేంద్రంలో తగిన లైటింగ్, వెంటిలేషన్ లేకపోవడం, ప్లాస్టిక్ డ్రమ్ములలో పచ్చళ్లను నిల్వ ఉంచడం, ముడి సరుకులు నిల్వ ఉంచడానికి సరైన స్టోరేజ్ సదుపాయాలు లేకపోవడం, ఆహార పదార్థాలు, ముడి సరుకులపై ఈగలు ఉండడాన్ని గుర్తించారు. లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన రెడీ టు ఈట్ సేవరీస్, మినప్పప్పు, రాక్ సాల్ట్, బెల్లం, నూనె, నెయ్యి, మొదలగు పదార్థాలను గుర్తించి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి వాటిని సీజ్ చేశారు.
- వైరా రోడ్ లో గల ఐబాకో ఐస్ క్రీమ్ యూనిట్లో సరైన పేరుతో లైసెన్స్ లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్రీములు, చాక్లెట్లు నిల్వ ఉంచడం, తయారీ, ఎక్స్పైరీ డేట్ లను వినియోగదారులకు సరైన విధంగా డిస్ ప్లే చేయకపోవడం, అపరిశుభ్ర వాతావరణంలో రిఫ్రిజిరేటర్లలో చాక్లెట్లు ఇతర పదార్థాలను నిల్వ ఉంచడం, సరైన పెస్ట్ కంట్రోల్ పద్ధతులను పాటించకపోవడంతో యాజమాన్యానికి నోటీసులు అంటించారు.
- ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్న జీపీ రెడ్డి ఘీ స్వీట్స్ లో పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో కేక్స్ తయారు చేయడం, కేక్స్, ఇతర స్వీట్స్ తయారీలో హానికర రసాయనాలు కలిగినటు లాంటి రంగులు కలపడం, ప్లాస్టిక్ బకెట్లలో క్రీమును నిల్వ ఉంచడం, ఈగలతో కూడి కేకును నిల్వ ఉంచడం లాంటి లోపాలను గుర్తించారు. రూ.20 వేల విలువగల ఐదు కిలోల కాలం చెల్లిన చెర్రీస్, ఫ్రూట్ క్రషెస్ ను గుర్తించి వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన సుమారు రూ.30 వేల విలువ గల 15 కిలోల కన్ఫెక్షనరీ పదార్థాలు, డ్రై ఫ్రూట్స్, ఇతర పదార్థాలను సీజ్ చేశారు. ఈ రకమైన ప్రజారోగ్యంతో చెలగాటమాడే వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే సంబంధిత శాఖ సహాయంతో సీజ్ కూడా చేస్తామని అధికారులు హెచ్చరించారు.