ఉమ్మడి జిల్లాలో కొత్తగా 5 ఏటీసీలు..ఖమ్మంలో 3, భద్రాద్రిలో 2 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు మంజూరు

ఉమ్మడి జిల్లాలో కొత్తగా 5 ఏటీసీలు..ఖమ్మంలో 3, భద్రాద్రిలో 2 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు మంజూరు

 

  • ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.45 కోట్లు కేటాయింపు
  • ఆధునిక సాంకేతికతపై యువతకు శిక్షణ
  • పెరగనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 
  • టెన్త్ పాస్ అయితే చాలు

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యువతకు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా ఐదు అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లను (ఏటీసీ) మంజూరు చేసింది. ఖమ్మం జిల్లాకు మూడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెండు ఏటీసీలను కేటాయించింది. పాలేరు నియోజకవర్గానికి గాను తిరుమలాయపాలెంలో, వైరా నియోజకవర్గానికి గాను ఏన్కూరు మండలం తూతక్కలింగన్నపేటలో, సత్తుపల్లి నియోజకవర్గానికి మంజూరైన కేంద్రం సత్తుపల్లి మండలం తుంబూరులో ఏర్పాటు చేయనున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట, ఇల్లందులోని నియోజకవర్గ కేంద్రాల్లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లేబర్ ఎంప్లాయ్ మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్ మెంట్ (కార్మిక శాఖ) ఆధ్వర్యంలో వీటి ఏర్పాటుకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో ఎంఎస్ నెంబర్​ 8ని జారీ చేసింది. 

టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ (టీటీఎల్) భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 46 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటుచేయనుండగా, ఉమ్మడి జిల్లాకు ఐదు కేటాయించారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, టీటీఎల్ కలిపి రూ.45.15 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు. మొత్తం 46 కేంద్రాలకు రూ.2076.90 కోట్లు ఖర్చవుతుండగా, వీటిలో టీటీఎల్ కంపెనీ రూ.1426.46 కోట్లు (86 శాతం), రాష్ట్ర ప్రభుత్వం రూ.650.44 (14 శాతం) కోట్లు ఖర్చు భరించనున్నాయి. పదో తరగతి పరీక్ష పాస్ అయితే చాలు ఏటీసీల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉండడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు లాభం చేకూరనుంది.

ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లు... 

రాష్ట్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుపై గతేడాది టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాలని ఒప్పందంలో నిర్ణయించారు. వాటికి అదనంగా ఐటీఐలు లేని నియోజకవర్గాల్లో ఒకటి చొప్పున ఏటీసీలను ఏర్పాటు చేయాలని డిసైడయ్యారు. వాటిలో భాగంగా ఇప్పుడు కొత్తగా 46 ఏటీసీలను ఏర్పాటు చేస్తూ జీవో జారీచేశారు.

ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువత, విద్యార్థులను తీర్చిదిద్దేందుకు, ట్రైనింగ్ ఇచ్చేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. అధునాతన సామగ్రితో పాటు, కంప్యూటర్ల ద్వారా సాంకేతికతను ఏర్పాటు చేస్తారు. ఏటీసీల్లో ఆరు రకాల లాంగ్ టర్మ్ కోర్సులు, 23 రకాల షార్ట్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఏటీసీల్లో కేవలం వివిధ కోర్సుల్లో శిక్షణకే కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పనిచేస్తాయని ప్రభుత్వం చెబుతోంది.

సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమలకు సాంకేతిక కేంద్రాలుగా (టెక్నాలజీ హబ్) గా పనిచేయనున్నాయి. ఏటీసీల్లో ట్రైనింగ్ పొందిన వారికి టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. భవిష్యత్ లో ఏటీసీల్లో పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు కూడా సేవలందించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. గతేడాది హైదరాబాద్ మల్లేపల్లిలోని ఐటీఐలో ఏటీసీల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 

లాంగ్ టర్మ్ కోర్సులు..

కొత్తగా మంజూరైన ఏటీసీల్లో రెండేండ్ల లాంగ్ టర్మ్ కోర్సులుగా అడ్వాన్స్​డ్ సీఎన్సీ మెషినింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రిక్ వెహికల్ మెకానిక్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ ఎనాలసిస్ అండ్ డిజైనర్ (మెకానికల్) కోర్సులు ఉంటాయి. ఏడాది కోర్సులుగా మాన్యుఫ్యాక్చర్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ కోర్సులు ఉంటాయి. వీటితో పాటు 23 షార్ట్ టర్మ్ కోర్సులకు అవసరమైన ఫ్యాకల్టీ, టూల్స్, మిషనరీతో పాటు మాస్టర్ ట్రైనర్లను కూడా టాటా కంపెనీయే సమకూర్చనుంది.

వీటి ఏర్పాటుకు అవసరమైన భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. ఆధునిక పరిజ్ఞానంతో కూడిన రోబోటిక్స్, డిజిటల్, ఎలక్ట్రిక్, ఆటోమేషన్ రంగాల్లో విద్యార్థులు, యువతకు ఒక్కో కేంద్రంలో ఏటా 500 మంది చొప్పున ట్రైనింగ్ ఇవ్వనుండడంతో ఉమ్మడి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో స్థానికులకు మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 ఐటీఐలను గతేడాది ఏటీసీలుగా మార్చగా, ఖమ్మంలో ఒక ఐటీఐని ఏటీసీగా అప్ గ్రేడ్ చేశారు.