తెలంగాణ హెల్త్ హబ్గా, హైదరాబాద్ గ్లోబల్ సిటీ గా మారిందని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. బంజారాహిల్స్ లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ర్టం ఆరోగ్య తెలంగాణగా అవతరించిందని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఆరోగ్య రంగంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. 10 వేల పడకల సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సూపర్స్పెషాలిటీ ఎంసీహెచ్లను గాంధీ, నిమ్స్ లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలతో రాష్ర్టంలోని ప్రభుత్వాసుపత్రులు పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. 2014 లో ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు 30 శాతం ఉంటే, ప్రస్తుతం 70 శాతం డెలివరీలు జరగుతున్నాయని, గర్భీణులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వైద్యుల పనితీరే దీనికి కారణమని, మాతా శిశుమరణాలు గణనీయంగా తగ్గించామన్నారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో రాష్ర్టం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఎనీమియా బారి నుంచి రక్షించేందుకు జూన్ 14 నుంచి న్యూట్రిషన్ కిట్స్ అందించబోతున్నట్లు వివరించారు. నాడు పేదలు రొట్టెలు తింటే, ధనికులు అన్నం తిన్నారని ఇప్పుడు మొత్తం రివర్స్ అయిందని తెలిపారు.