
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
సిద్దిపేట/కోహెడ, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శుక్రవారం నుంచి రాష్ట్ర స్థాయి కిసాన్ మేళా ప్రారంభం కానుంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించే మేళాకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్న మేళాకు సుమారు 10 వేల మంది రైతులు హాజరవుతారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.
మేళాలో పంట కోతలకు సంబంధించిన యంత్రాలతో పాటు విత్తనాలు, ఎరువులు, మార్కెటింగ్ శాఖతో పాటు విత్తన కంపెనీలు, వ్యవసాయ యూనివర్సిటీ, పశు సంవర్థకం, బ్యాంకింగ్, సేంద్రీయ వ్యవసాయం, డ్రోన్స్, రోబోటిక్, సెరికల్చర్, ఆయిల్పామ్కు సంబంధించి 100 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. పెట్టుబడులు తగ్గిస్తూ పంట దిగుబడులు పెంచేలా రైతులకు సూచనలు ఇవ్వనున్నారు.
మేళాలో మొదటి రోజైన శుక్రవారం హుస్నాబాద్ డివిజన్, రెండో రోజు సిద్దిపేట, చేర్యాల, మూడో రోజు గజ్వేల్ డివిజన్ నుంచి రైతులు హాజరుకానున్నారు. అగ్రికల్చర్ సైంటిస్ట్లు రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ప్రత్యేక వర్క్షాప్లను నిర్వహించనున్నారు. శుక్రవారం జరిగే కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హాజరుకానున్నారు. హుస్నాబాద్లో మొదటి సారి రాష్ట్రస్థాయి మేళా జరుగుతుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో చేస్తున్న కిసాన్ మేళా ఏర్పాట్లను గురువారం కలెక్టర్ మనుచౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం ఎలా చేయాలో రైతులకు తెలియజేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కిసాన్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయం, వాణిజ్య పంటలు, ఆయిల్పామ్, వ్యవసాయ రంగంలో నూతన విధానాలను తెలియజేయడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమన్నారు.
మేళాలో సైంటిస్ట్లు, వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, కంపెనీల ప్రతినిధులు, వివిధ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు భాగస్వాములు అవుతారన్నారు. ప్రతి అరగంటకు ఒకసారి ప్రత్యేక వర్క్షాప్లు నిర్వహిస్తామన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ హమీద్, ఏసీపీ సదానందం ఉన్నారు.