
- హెచ్–1బీ వీసా ప్రోగ్రామ్పై కేంద్రం
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసా ప్రోగ్రామ్ కు సంబంధించి అమెరికా తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై కేంద్రప్రభుత్వం స్పందించింది. ఇది ఇరు దేశాల్లోని సంస్థలను ప్రభావితం చేయడంతోపాటు ఎన్నో కుటుంబాలకు ఇబ్బందికర అంశమని తెలిపింది. వీటి పరిణామాలను సంబంధిత భారత సంస్థలు సహా భాగస్వామ్య పక్షాలన్ని అధ్యయనం చేస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు శనివారం ఇండియన్ ఫారిన్ మినిస్ట్రీ (ఎంఈఏ) ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆవిష్కరణలు, సృజనాత్మకత వంటి రంగాల్లో రెండు దేశాల్లోని సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని భారత్ చెప్పింది. నిపుణుల రాకపోకల వల్ల సాంకేతిక అభివృద్ధి, ఆవిష్కరణలు, పోటీతత్వం, ఆర్థిక వృద్ధితోపాటు సంపద సృష్టితో ఇరు దేశాలు పరస్పర లబ్ధి పొందాయని వెల్లడించింది. అయితే, ప్రస్తుత అమెరికా నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది.