లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధింపు రాష్ట్రాల ఇష్టం

లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధింపు రాష్ట్రాల ఇష్టం
  • కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో కర్ఫ్యూ లక్డౌన్ కంటెయిన్ మెంట్ జోన్ ల విధింపు పై రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా స్పందించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చని ఆయన తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి అందిన ఆక్సిజన్ పంపిణి బాధ్యత కూడా రాష్ట్రాలదేనని స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బందిపడకుండా అవసరాన్ని గుర్తించి విదేశాల నుంచి యుద్ధవిమానాల తో ఆక్సిజన్ తెస్తున్నామని, జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు ఆక్సిజన్ కేటాయింపులు చేస్తున్నామన్నారు. 
కరోనా కట్టడి ప్రజల చేతుల్లోనే ఉంది –కిషన్ రెడ్డి
కరోనా శరవేగంగా విస్తరిస్తున్నందున కట్టడి ప్రజల చేతుల్లోనే ఉందని కిషన్ రెడ్డి అన్నారు. కరోనా వస్తే ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వగలం గాని అంతకు మించిన పరిస్థితులు వస్తున్నందున ప్రజలు కూడా బాధ్యతగా నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ ద్వారా కరోనా ట్రీట్మెంట్ అందించాలని ఆయన సూచించారు. 
వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ పై కఠినంగా వ్యవహరించాలి 
కరోనా వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ జరుగుతున్నట్లు వస్తున్న వార్తలపై కిషన్ రెడ్డి స్పందించారు. వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ పై రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ట్రాన్స్ ఫర్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, పూర్తి స్థాయిలో అధికారిక ప్రక్రియ జరగాల్సి ఉందన్నారు. అయితే దీనికి సంబంధించిన పేపర్స్ ఎక్కడున్నాయో ఎవరికి తెలియడం లేదన్నారు. కరోనా కట్టడికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని.. అయినా ఏం చేసిన ప్రజల భాగస్వామ్యం ఉంటేనే కట్టడి సాధ్యమౌతుందని ఆయన స్పష్టం చేశారు. 
కరోనా లక్షణాలు కనిపిస్తే స్వచ్చందంగా ఐసొలేషన్ కి వెళ్లాలి
కరోనా లక్షణాలు కనిపించిన వారు.. లేదా అనుమానం ఉన్నవారు స్వచ్చందంగా కఠిన ఐసోలేషన్ కి వెళ్లాలని..  అప్పుడే చెయిన్ బ్రేక్ చేయగలమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో కలిసి కోవిడ్ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నామని తెలిపారు. కోవిడ్ సెకండ్ వేవ్ లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయని.. కేసులు ఈ స్థాయిలో పెరుగుతాయని ఎవరు ఊహించలేదన్నారు. కరోనా మొదటి వేవ్ ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం.. ప్రధాని చొరవ , శాస్త్రవేత్తల కృషి తో వేగంగా వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసాం, కొన్ని వ్యాక్సిన్ ల తయారీ చివరి దశలో ఉన్నాయని వివరించారు. హైదరాబాద్ , పూణే, యూపీ లోని ఫార్మా కంపెనీలను ప్రధాని నేరుగా సందర్శించారని, డీఆర్డీవో చౌకగా వ్యాక్సిన్ ని వృద్ధి చేసింది, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. దేశంలో బెడ్స్, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని వీటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా, పంపిణి ఒక ఛాలెంజ్
ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా, పంపిణీ ఒక ఛాలెంజ్ గా మారిందని.. డిమాండ్ పెరగడంతో 24 గంటలు నిరంతరాయంగా ( 24/7) వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. భారత్ బయో టెక్ వ్యాక్సిన్ ని ఇతర కంపెనీలలో భారత్ బయో టెక్ బ్రాండింగ్ తోనే ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రపంచ దేశాల సహకారం తీసుకుంటూ సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ , వ్యాక్సిన్ , మెడికల్ పరికరాలను సమకూర్చుకోవడంలో అన్ని దేశాలనుంచి సహకారం తీసుకుంటూనే దేశంలో ఉత్పత్తులను వేగవంతం చేశామని, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులను మానిటరింగ్ చేస్తున్నామని, 180 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. గాలి ద్వారా కూడా ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్లను పెడుతున్నామని, హైదరాబాద్ లో  గాంధీ హాస్పిటల్ , టీమ్స్ , కింగ్ కోఠి , సనత్ నగర్ హాస్పిటల్స్ కు మంజూరు చేశామని త్వరలోనే బీబీనగర్ ఎయిమ్స్ కి  కేటాయిస్తామన్నారు. స్థానిక సమస్యలతో బీబీనగర్ ఎయిమ్స్ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పారామెడికల్ , నర్సింగ్ కోర్సులు అందుబాటులోకి  రానున్నాయని, 50 ఆక్సిజన్ సిలెండర్లు బీబీనగర్ కు ఇచ్చామని, కాన్సన్ట్రేటర్స్ త్వరలోనే వస్తాయని, కోవిడ్ 50 బెడ్లు ఉన్నాయని త్వరలోనే 200 బెడ్స్ కి పెంచుతామన్నారు. అన్ని హాస్పిటల్స్ ని పూర్తిస్థాయిలో కోవిడ్ హాస్పిటల్స్ గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, పీఎం కేర్స్ ద్వారా టిమ్స్ ,గాంధీ హాస్పిటల్స్ కి  400 వెంటిలేటర్లను అందించామని కిషన్ రెడ్డి తెలిపారు.