జనగామ, వెలుగు : ‘కడియం శ్రీహరి అంటేనే ఒక బ్రాండ్.. నేను రాజీనామా చేయను.. స్పీకర్ నిర్ణయం తర్వాతే నా కార్యచరణ ప్రకటిస్తా’ అని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తన రాజీనామాపై ఆలోచించడం మానేసి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా పనిచేయాలని సూచించారు. సోమవారం స్టేషన్ ఘన్పూర్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి సర్కార్ పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గెలిచే అభ్యర్థులను గ్రామాల్లోని నాయకత్వమే ఫైనల్ చేసుకోవాలని, తప్పని పరిస్థితి ఉంటే రెండు, మూడు పేర్లు తన దృష్టికి తీసుకొస్తే ఎంపిక చేస్తానని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు పాల్గొన్నారు.
