
కరీంనగర్ రూరల్, వెలుగు: వెంటనే స్టైఫండ్చెల్లించాలంటూ హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్లోని ప్రతిమ మెడికల్ కాలేజీ ముందు జూనియర్ డాక్టర్లు మంగళవారం (june 17) బైఠాయించి ధర్నా చేశారు. తమకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.25వేల స్టైఫండ్ఇస్తుండగా.. ప్రతిమ మెడికల్ కాలేజీ మేనేజ్ మెంట్ ఇవ్వడం లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు.
ఆస్పత్రిలో రాత్రి పగలు సేవలు అందిస్తుండగా తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుండడంతో ధర్నా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని మల్లారెడ్డి, మెడిసిటీ మెడికల్కాలేజీల విద్యార్థులు ఆందోళన చేస్తే ఆయా యాజమాన్యాలు స్టైఫండ్ చెల్లించేందుకు అంగీకరించాయని గుర్తు చేశారు. ఇకనైనా ప్రతిమ మెడికల్ కాలేజీ మేనేజ్ మెంట్ మొండివైఖరి వీడి తమ సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు.