జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ ఇవ్వట్లేదు.. కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీ వద్ద ధర్నా

జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ ఇవ్వట్లేదు.. కరీంనగర్  ప్రతిమ మెడికల్ కాలేజీ వద్ద ధర్నా

కరీంనగర్​ రూరల్, వెలుగు: వెంటనే స్టైఫండ్​చెల్లించాలంటూ హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు.  కరీంనగర్ రూరల్ మండలం నగునూర్​లోని ప్రతిమ మెడికల్ కాలేజీ ముందు జూనియర్ డాక్టర్లు మంగళవారం (june 17) బైఠాయించి ధర్నా చేశారు. తమకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.25వేల స్టైఫండ్​ఇస్తుండగా..  ప్రతిమ మెడికల్ కాలేజీ మేనేజ్ మెంట్ ఇవ్వడం లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. 

ఆస్పత్రిలో రాత్రి పగలు సేవలు అందిస్తుండగా తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుండడంతో ధర్నా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని మల్లారెడ్డి, మెడిసిటీ మెడికల్​కాలేజీల విద్యార్థులు ఆందోళన చేస్తే ఆయా యాజమాన్యాలు స్టైఫండ్ చెల్లించేందుకు అంగీకరించాయని గుర్తు చేశారు. ఇకనైనా ప్రతిమ మెడికల్ కాలేజీ మేనేజ్ మెంట్ మొండివైఖరి వీడి తమ సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు.