- ఎన్ఎస్ఈ ఆగింది!
- 4 గంటలు పనిచేయని ఎక్స్చేంజ్.. ఇన్వెస్టర్లకు కష్టాలు
- ఎటువంటి వార్నింగ్ లేకుండానే ఆపేశారు
- 5 గంటల వరకు ట్రేడింగ్ పొడిగింపు
న్యూఢిల్లీ: టెక్నికల్ సమస్యలతో ఎన్ఎస్ఈ పనిచేయకపోడంతో 4 గంటల పాటు ఇన్వెస్టర్లు ఇబ్బంది పడ్డారు. అప్పటికే తీసుకున్న పొజిషన్లు క్యాన్సిల్ అయ్యాయా లేదా తెలియకపోవడంతో ..మార్కెట్లో ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. కాగా, బుధవారం 11.40 కి తాత్కాలికంగా ఆగిపోయిన ఎన్ఎస్ఈ, సాయంత్రం 3.45 కి తిరిగి ఓపెన్ అయ్యింది. దీంతో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి(ఎన్ఎస్ఈ), బీఎస్ఈలు ట్రేడింగ్ టైమ్ను సాయంత్రం 5 వరకు పొడిగించాయి. సుమారు 4 గంటల పాటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఆగిపోయింది. ‘ఇద్దరు సర్వీస్ ప్రొవైడర్లతో ఎన్ఎస్ఈకి టెలికం లింక్లున్నాయి. ఈ టెలికం లింక్స్లో సమస్యలు తలెత్తడంతో ఎన్ఎస్ఈ సిస్టమ్పై ప్రభావం పడుతోంది’ అని ట్రేడింగ్ నిలిచిపోవడానికి కారణంగా ఎన్ఎస్ఈ వివరించింది. ఉదయం 11.40 నుంచి అన్ని సెగ్మెంట్లలో ట్రేడింగ్ను ఆపేస్తున్నామని ప్రకటించింది. కాగా, 10.06 నుంచే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇంకా కొన్ని ఇండెక్స్ల రేట్లను అప్డేట్ చేయడంలో ఎన్ఎస్ఈ ఇబ్బందులు పడింది. బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 14,820.45 పాయింట్ల వద్ద ఆగిపోయింది. అప్పటికే ఈ ఇండెక్స్ 112.65 పాయింట్లు అప్లో ఉంది.
దర్యాప్తుకు సెబీ ఆదేశం..
బ్రోకరేజిలకు ఎటువంటి ముందస్తు వార్నింగ్ ఇవ్వకుండా ట్రేడింగ్ను ఎన్ఎస్ఈ ఆపేయడంతో, ఇన్వెస్టర్లు, బ్రోకర్లు ఇబ్బంది పడ్డారు. ట్రేడింగ్ ఎందుకు నిలిచిపోయింది..దానికి కారణాలేంటో చెప్పాలని, దీనిపై దర్యాప్తు చేయాలని ఎన్ఎస్ఈని సెబీ ఆదేశించింది. టెక్నికల్ రిజల్ట్స్తో ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ ఆగిపోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలా ఆగిపోయినందుకు ఎన్ఎస్ఈ పెనాల్టీలను చెల్లించింది. ఇలా ట్రేడింగ్ ఆగిపోయినప్పుడు ఇన్వెస్టర్లకు వచ్చే నష్టాలను భర్తి చేసేందుకు ఓ పాలసీని కూడా తీసుకురావాలని సెబీ చూస్తోంది. ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ ఆగిపోవడంతో బీఎస్ఈ ద్వారా తమ ఆర్డర్లను అమలు చేయాలని బ్రోకరేజి కంపెనీ జెరోధా తన క్లయింట్లకు సలహాయిచ్చింది. అప్స్టాక్స్, ఐసీఐసీఐ డైరక్ట్లు కూడా ఇలాంటి సలహాలనే తమ క్లయింట్లకు ఇచ్చాయి. ఉదయం 11.40 నుంచి ఈక్విటీ, ఎఫ్ అండ్ ఓ, కరెన్సీ ట్రేడింగ్లను ఎన్ఎస్ఈ తాత్కాలికంగా ఆపిందని జెరోధా సీఈఓ నితిన్ కామత్ అన్నారు. క్యాష్, డెరివేటివ్స్, కరెన్సీ సెగ్మెంట్లలోని అన్ని ఓపెన్ ఆర్డర్లను ఎక్స్చేంజి క్యాన్సిల్ చేసిందని పేర్కొన్నారు. ‘ఎన్ఎస్ఈ ట్రేడింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. పెండింగ్లోని అన్ని ఆర్డర్లను క్యాన్సిల్ చేసింది’ అని బ్రోకరేజి కంపెనీ ఐసీఐసీఐ డైరక్ట్ పేర్కొంది. ఈ ఇష్యూపై ఉదయం నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు ట్విటర్లో ఫిర్యాదు చేశారు. ఎన్ఎస్ఈ ఇష్యూపై ఇంటర్నెట్ యూజర్లు జోక్లు పేలుస్తున్నారు. మరికొంత మంది ఈ ఇష్యూపై మెమ్స్ను క్రియేట్ చేశారు.
డే ట్రేడర్ల గుండెల్లో గుబులు పుట్టించింది
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో టెక్నికల్ సమస్యలు రావడంతో లక్షలాది మంది డే ట్రేడర్లు కొన్ని గంటలపాటు టెన్షన్ అనుభవించాల్సి వచ్చింది. ఉదయం ట్రేడింగ్ మొదలయ్యాక 10.06 నిమిషాలకు ఎన్ఎస్ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ టిక్కర్లు నిలిచిపోయాయి. ఫలితంగా, ఎఫ్ అండ్ఓలో ఈ రెండు ఇండెక్స్లలో బయ్యింగ్, సెల్లింగ్ ఆర్డర్లు ప్లేస్ చేయడంతోపాటు, పొజిషన్స్ తీసుకున్న ఇన్వెస్టర్లందరూ అయోమయంలో పడిపోయారు. చివరి గురువారం కావడంతో (25 వ తేదీ) ఫిబ్రవరి ఎఫ్అండ్ ఓ సిరీస్ క్లోజింగ్ కూడా . దీంతో తమ లాంగ్, షార్ట్ పొజిషన్స్ కవర్ చేసుకోవడమెలా అనే ఆందోళన ఇన్వెస్టర్లలో పెరిగింది. టెక్నికల్ ప్రోబ్లమ్స్ సాల్వ్ కాకపోవడంతో, ఆ తర్వాత 11.40 నిమిషాలకు ట్రేడింగ్ నిలిపి వేస్తున్నట్లు ఎన్ఎస్ఈ ప్రకటించింది. ఇలా ప్రకటించడానికి ముందుగా ట్రేడ్ డీల్స్లో ఎంటరయిన ఇన్వెస్టర్లందరూ క్లారిటీ కోసం మరో రెండున్నర గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది.
సెన్సెక్స్ 1000 పాయింట్లు అప్..
తిరిగి ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ దూసుకుపోయింది. 274 పాయింట్లు లాభపడి 14,982 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ 1030 పాయింట్లు ఎగిసి, 50,782 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రభుత్వ వసూళ్లూ, చెల్లింపులలో ప్రైవేట్ బ్యాంకులను కూడా అనుమతించనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు భారీగా పెరిగాయి. ఫలితంగా బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 1,335 పాయింట్లు లాభపడింది. టీసీఎస్, పవర్ గ్రిడ్, డా.రెడ్డీస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు క్లోజ్ అయ్యే(3.30) కొన్ని నిమిషాల ముందు సాయంత్రం 5 వరకు ట్రేడింగ్ను పొడిగిస్తున్నామని ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు ప్రకటించాయి. ఎన్ఎస్ఈ ఆగిపోయినప్పటికీ, బీఎస్ఈ పనిచేయడంతో ఇండియన్ మార్కెట్ పెద్దగా ఇబ్బంది పడలేదు. ‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చివరి గంటలో ప్రైవేట్ బ్యాంక్ షేర్లు ఇండెక్స్లను 2 శాతం వరకు పెంచాయి’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ అన్నారు. షాంఘై, హాంకాంగ్, సియోల్, టోక్యో మార్కెట్లు నెగిటివ్లో క్లోజయ్యాయి. యూరప్ స్టాక్ ఎక్స్చేంజిలు మిడ్ సెషన్లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 0.96 శాతం పెరిగి బ్యారెల్ 65.10 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు పెరిగి 72.35 వద్ద క్లోజయ్యింది.
1998 లో రష్యా మార్కెట్ల షట్డౌన్ను ఎన్ఎస్ఈ ఈవేళ గుర్తుకు తెచ్చింది. రష్యన్ అధికారులు యూరప్ మార్కెట్లు ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేసేవారు. ఈ మార్కెట్లు పాజిటివ్గా ఉంటేనే రష్యన్ మార్కెట్లు కూడా ఓపెన్ చేసేవారు. లేకపోతే షట్ డౌన్ కొనసాగేది.
‑ శంకర్ శర్మ, ఫస్ట్ గ్లోబల్ ఫౌండర్
For More News..