ముంబై: మహారాష్ట్రలో వీకెండ్ లాక్డౌన్ పెట్టడంతో స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా క్రాష్ అయ్యాయి. అంచనాలకు మించి కరోనా సెకెండ్ వేవ్ విస్తరిస్తుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోంది. బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ సోమవారం సెషన్లో 871 పాయింట్లు(1.74 శాతం) నష్టపోయింది. ఇంట్రాడేలో 1,450 పాయింట్ల వరకు పడిన ఈ ఇండెక్స్, చివరికి 49,159 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 230 పాయింట్లు(1.54 శాతం) పతనమై 14,638 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటీ, మెటల్ ఇండెక్స్లు మినహా మిగిలిన సెక్టార్ ఇండెక్స్లన్నీ నష్టాల్లో ముగిశాయి. రూ. 2.11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్(ఏప్రిల్–జూన్) లో కంపెనీలపై నెగిటివ్ ప్రభావం పడుతుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో పెరుగుతున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్, కంపెనీల క్యూ4 రిజల్ట్స్ ఈ వారం మార్కెట్ను నడిపిస్తాయని చెప్పారు. నిఫ్టీలో హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో, బ్రిటానియా, ఇన్ఫోసిస్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐషర్ మోటార్స్, ఎం& ఎం షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ సోమవారం రూ. 6 లక్షల కోట్లను క్రాస్ చేసింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు మార్కెట్ క్యాప్లో ఇన్ఫోసిస్ కంటే ముందున్నాయి. గ్లోబల్గా సియోల్, టోక్యో మార్కెట్లు పాజిటివ్గా క్లోజయ్యాయి. హాలిడే కావడంతో హాంకాంగ్, షాంఘై, యూరప్లోని కొన్ని దేశాలు మార్కెట్లు ఓపెన్ కాలేదు. బ్రెంట్ క్రూడ్ 2.20 శాతం తగ్గి బ్యారెల్ 63.43 డాలర్ల కు చేరుకుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 18 పైసలు తగ్గి 73.30 వద్ద క్లోజయ్యింది.
ఐటీ కంపెనీల రిజల్ట్స్ అదిరేనా?
ఐటీ కంపెనీల జనవరి–మార్చి క్వార్టర్(క్యూ4) రిజల్ట్స్ మార్కెట్ అంచనాలను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో(క్యూ3) లో భారీ డీల్స్ను పొందడంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్, మైండ్ ట్రీ వంటి ఐటీ కంపెనీల క్యూ4 రిజల్ట్స్ మెరుగ్గా ఉంటాయనే అంచనాలున్నాయి. మరోవైపు కరోనా వలన ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చులు కూడా పెరగడంతో ఈ కంపెనీల లాభాలు తగ్గుతాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ప్రతి సారీ క్వార్టర్లీ రిజల్ట్స్ను మొదట ఐటీ కంపెనీలే ప్రకటిస్తుంటాయి. ఈ నెల 12 న టీసీఎస్, 14 న ఇన్ఫోసిస్, 15 న విప్రో, మైండ్ ట్రీ కంపెనీల క్యూ4 రిజల్ట్స్ వెలువడనున్నాయి. క్యూ3 లో పెద్ద డీల్స్ను దక్కించుకోవడంతో పాటు, వివిధ సెక్టార్లలో డిజిటల్ ఖర్చులు పెరగడంతో ఐటీ కంపెనీల క్యూ4 రిజల్ట్స్ బాగుంటాయని అంచనావేస్తున్నామని కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ ఎస్ సతీష్ కుమార్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ 12–14 శాతం పెరుగుతుందనే గైడ్లైన్స్ను ఇన్ఫోసిస్ ప్రకటిస్తుందని, 10–12 శాతం పెరుగుతుందని హెచ్సీఎల్ గైడ్లైన్స్ ఉంటాయని అంచనావేశారు. క్వార్టర్ ప్రాతిపదికన టైర్ 1 ఐటీ కంపెనీల క్యూ4 రిజల్ట్స్ గ్రోత్ 2.2 శాతం నుంచి 3.9 శాతం ఉంటుందని అభిప్రాయపడ్డారు. టైర్ 2 ఐటీ కంపెనీలయితే 2.5 శాతం నుంచి 4.5 శాతం వరకు గ్రోత్ను నమోదు చేస్తాయని పేర్కొన్నారు.
ఆర్డర్లు పెరిగాయి...
టీసీఎస్కు క్యూ3 లో పోస్ట్బ్యాంక్, ప్రుడెన్షియల్ వంటి పెద్ద కంపెనీల నుంచి ఆర్డర్లు దక్కాయి. ఈ రెండు డీల్స్తో టీసీఎస్ క్యూ 4 గ్రోత్ 2 శాతం వరకు పెరుగుతుందని అంచనాలున్నాయి. వెహికల్ తయారీ కంపెనీ రోల్స్ రాయ్స్ నుంచి, ఇంకొన్ని కంపెనీల నుంచి 50–100 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను ఇన్ఫోసిస్ క్యూ3 లో పొందగలిగింది. వెరిఫోన్ నుంచి విప్రో ఆర్డర్ను దక్కించుకుంది. ఫైనాన్స్, హెల్త్ కేర్ సెక్టార్ల నుంచి హెచ్సీఎల్కు మంచి ఆర్డర్లున్నాయి. కంపెనీ డీడబ్ల్యూఎస్ టెక్నాలజీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మేజినిక్, లినియం వంటీ కంపెనీల నుంచి కాగ్నిజెంట్ పెద్ద ఆర్డర్లను దక్కించుకుంది.