- వోలటాలిటీ ఉండే అవకాశం
న్యూఢిల్లీ: ఈ వారం మార్కెట్ సెంటిమెంట్ను మాక్రో ఎకనామిక్ డేటా, గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ యాక్టివిటీ నిర్ణయిస్తుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ‘‘నవంబర్ డెరివేటివ్స్ ఎక్స్పైరీ (మంగళవారం) ముందు వోలటాలిటీ పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 28న ఇండియా సెప్టెంబర్ క్వార్టర్ జీడీపీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా విడుదల కానున్నాయి.
వీటిని మార్కెట్ గమనిస్తుంది”అని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు. జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, రూపాయి విలువ మరింత పడితే సమీప కాలంలో ప్రాఫిట్ బుకింగ్ జరగొచ్చని అన్నారు. బ్రెంట్ క్రూడ్ ధరలు, రూపాయి-–డాలర్ ట్రెండ్ కూడా ఇన్వెస్టర్లు గమనించాలని ఆయన సలహా ఇచ్చారు. ‘‘ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో భారత మార్కెట్లు ప్రస్తుత ఆల్టైమ్ హైల నుంచి స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది” అని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. గత వారం సెన్సెక్స్ 669 పాయింట్లు (0.79శాతం) పెరిగి 85,801.70 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 158 పాయింట్లు (0.61శాతం) లాభపడి 26,246.65 వద్ద కొత్త పీక్ సాధించింది.
