న్యూఢిల్లీ: కరోనా టెస్టుల కోసం చైనా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను రెండ్రోజుల పాటు వినియోగించొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల రిజల్ట్స్ లో తప్పులున్నాయని, వీటిలో కచ్చితత్వం లోపించిందని కొన్ని రాష్ట్రాల నుంచి కంప్లయింట్స్ రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిపై విచారణ జరిపిస్తామని పేర్కొంది.‘‘ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను అన్ని రాష్ట్రాలకూ పంపిణీ చేశాం. వీటి రిజల్ట్స్ కరెక్టుగా లేవని ఒక్క రాష్ట్రం నుంచి ఫిర్యాదు అందింది. మరో మూడు రాష్ట్రాలతో మాట్లాడి దాన్ని మేం కన్ఫమ్ చేసుకున్నాం. వీటి ద్వారా పాజిటివ్ శాంపిళ్లను టెస్ట్చేస్తే , అక్యురెన్సీలో తేడాలొచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో 6 శాతమే కచ్చితత్వం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో 71 శాతం కచ్చితత్వం ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానిపై మేం వర్క్ చేస్తున్నాం” అని ఐసీఎంఆర్ ఎపిడెమియాలజీ హెడ్ రామన్ ఆర్ గంగాఖేడ్కర్ మంగళవారం చెప్పారు. రెండ్రోజుల్లో అన్ని రాష్ట్రాలకు ఎనిమిది మందితో కూడిన ఎక్స్ పర్ట్స్ టీమ్స్ ను పంపిస్తామని, వారు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా శాంపిళ్లను తీసుకొచ్చి ఇక్కడ టెస్టు చేస్తారని తెలిపారు. అప్పటి వరకు కిట్లను వినియోగించొద్దని అన్ని రాష్ట్రాలను ఆదేశించారు. ఒకవేళ కిట్లలో లోపాలున్నాయని తేలితే, వాటన్నింటినీ రీప్లేస్ చేయమని పంపించిన కంపెనీని అడుగుతామన్నారు. కిట్ల రిజల్ట్స్ కరెక్టుగా లేవని రాజస్థాన్ సహా మరికొన్ని రాష్ట్రాలు ఐసీఎంఆర్ కు కంప్లయింట్ చేశాయి.
మొత్తం 5 లక్షల కిట్లు
దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో టెస్టుల సంఖ్యను పెంచాలని కేంద్రం భావించింది. ఇప్పటి వరకు ఆర్టీ పీసీఆర్ ద్వారా కరోనా టెస్టులు చేస్తుండగా, దీనికి టైమ్ ఎక్కువగా తీసుకుంటోంది. మరోవైపు వీటిని ల్యాబుల్లోనే చేయాల్సి ఉంటుంది. దీంతో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా హాట్ స్పాట్ ఏరియాల్లో టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పొయిన వారమే చైనా నుంచి 5 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తెప్పించింది. వీటిని అన్ని రాష్ట్రాలకూ పంపిణీ చేసింది. ర్యాపిడ్ టెస్టులో శాంపిల్ గా రక్తాన్ని తీసుకుంటారు. వేలి నుంచి రక్తం తీసి టెస్టు చేస్తారు. కరోనా ఆనవాళ్లు ఉన్నాయా? లేదా? అనేది ఇందులో త్వరగా తెలుస్తుంది. అయితే ఈ టెస్టుతో కరోనా ఉందా? లేదా? అనేది కచ్చితంగా చెప్పలేం. పీసీఆర్ టెస్టు చేస్తేనే వైరస్ సోకింది? లేనిది?
నిర్ధారించగలం.
చైనా కిట్లతో తప్పుడు రిజల్ట్స్
జైపూర్: చైనా నుంచి దిగుమతి చేసుకున్న కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు సరిగా పనిచేయట్లేదని, వాటిని వాపస్ పంపాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్ పాజిటివ్ పేషెంట్లకు ఈ కిట్లతో టెస్టు చేసి చూడగా.. నెగిటివ్ రిపోర్టు వచ్చిందని ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ చెప్పారు. వందకు 90 శాతం కచ్ఛితత్వం చూపించాల్సిన కిట్లు.. కేవలం 5.4 శాతం అక్యురసీ మాత్రమే ఉంటోందని చెప్పారు. కరోనా టెస్టుల కోసం ఇండియన్ మెడికల్ రీసెర్ట్ కౌన్సిల్(ఐసీఎంఆర్) చైనా నుంచి 6 లక్షల 50 వేల ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకుంది. వీటిలో రాజస్థాన్ కు కేంద్రం10 వేల కిట్స్ ను పంపింది. రాష్ట్ర సర్కార్ కూడా చైనా నుంచి మరో లక్ష కిట్లను ఆర్డర్ చేసి తెప్పించుకుంది. ఈ కిట్లను పరిశీలించేందుకు కరోనా పాజిటివ్ పేషెంట్కు టెస్ట్చేస్తే నెగిటివ్ రిపోర్ట్ చూపించాయని మంత్రి శర్మ చెప్పారు. కేంద్రం సూచించిన అన్ని గైడ్ లైన్స్ ను ఫాలో అయ్యామని అన్నారు. ఈ టెస్టు కిట్లను టెస్ట్ చేసేందుకు మైక్రోబయాలజీ, మెడికల్ డిపార్ట్ మెంట్ల చీఫ్ లతో కమిటీ వేయడంతో పాటు ఐసీఎంఆర్కు లెటర్ రాసినట్లు చెప్పారు. స్టాండర్డ్స్ లేని ఈ కిట్ల వాడకం నిలిపేశామని మంత్రి చెప్పారు. చైనా కిట్లు సరిగా పని చేయడంలేదని బెంగాల్ ప్రభుత్వం కూడా ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
