భార్య ఆరు నెలల గర్భవతి అని కూడా చూడకుండా మంచానికి కట్టేసి కాల్చి చంపేశాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయవిదారక ఘటన పంజాబ్లోని అమృత్సర్లో చోటుచేసుకున్నది. అమృత్సర్కు సమీపంలోని బుల్లెనంగల్కు చెందిన పింకీ, సుఖ్దేవ్ భార్యాభర్తలు. పింకి ఆరు నెలల గర్భవతి. దంపతుల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సుఖ్ దేవ్ ఖరీదైన క్యారియర్ పావురాలను పెంచుకునే వాడు. వాటి పోషణ విషయంలో సరిగా చూసుకోవడంలేదని భర్త, కూలీ డబ్బులన్నీ పావురాల కోసమే ఖర్చు చేస్తున్నాడని భార్య మధ్య శుక్రవారం (ఏప్రిల్ 19) రాత్రి ఘర్షణ అయింది.
ఒకరినొకరు తిట్టుకొని.. కోపంతో రెచ్చిపోయిన సుఖ్దేవ్ గర్భవతి అనికూడా చూడకుండా పింకీని మంచానికి కట్టేశాడు. ఆవేశంలో ఆమెకు నిప్పంచడంతో సజీవదహణమయింది. వెంటనే సుఖ్దేవ్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. శనివారం రాత్రి నిందితుడని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే విషయమై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని పంజాబ్ డీజీపీని కోరింది. మూడు రోజుల్లోగా నిందితుడిని పట్టుకోవాలని, శిక్ష పడేలా చేయాలని స్పష్టంచేసింది.