
హైదరాబాద్, వెలుగు: దక్షిణాదిలో కార్యకలాపాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆరోగ్య బీమా సంస్థ గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ తమ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విస్తరిస్తామని, 10 వేల మంది ఏజెంట్లను నియమించుకుంటామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో 2025 ఫిబ్రవరిలో ప్రారంభమైన జోనల్ ఆఫీసుకు తోడుగా, తెలంగాణకు ప్రాంతీయ హబ్గా హైదరాబాద్ రీజనల్ కార్యాలయ సేవలు అందిస్తుందని కంపెనీ ఎండీ, సీఈవో శ్రీనివాసన్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కీలక జిల్లాల్లో ఈ ఏడాది 14 ఆఫీసులను ప్రారంభిస్తామని వెల్లడించారు.
కంపెనీ గత అక్టోబర్లో తమ ఫ్లాగ్షిప్ పథకం గెలాక్సీ ప్రామిస్ను ప్రారంభించింది. తాము రూ. 3 లక్షల నుంచి రూ. కోటి వరకు సమ్ ఇన్సూర్డ్ ఆప్షన్లను అందిస్తున్నామని, ఇప్పటికే 68 వేలమందికిపైగా బీమా కవరేజీ ఇచ్చామని గెలాక్సీ తెలిపింది.