నాటు కోళ్ల షెడ్డుపై వీధి కుక్కల దాడి.. 250 కోళ్లు మృత్యువాత

నాటు కోళ్ల షెడ్డుపై  వీధి కుక్కల దాడి.. 250 కోళ్లు మృత్యువాత

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం జరిగింది. నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో ఓ నాటు కోళ్ల పెంపకం దారుడికి చెందిన నాటు కోళ్లపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 250కి పైగా నాటు కోళ్లు మృత్యువాత పడ్డాయి. రైతు లబోదిబో మంటున్నాడు.

రంగాపూర్ గ్రామానికి చెందిన వనపల్లి మల్లేష్ ఓ షెడ్డులో నాటు కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. షెడ్డులో దాదాపు 300 కి పైగా నాటు కోళ్లను పెంచి వాటిని మృగశిర కార్తెను పురస్కరించుకొని మార్కెట్లో మంచి డిమాండ్ కు  అమ్మేందుకు పోషణ చేపట్టారు. అయితే రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ షెడ్డులోకి కుక్కలు ప్రవేశించి మొత్తం నాటు కోళ్లను దొరికినవి దొరికినట్టుగా కొరికి చంపాయి. మరికొన్ని కోళ్లు బయటికి తప్పించుకోగా వాటిని కూడా వెంటాడు వేటాడి చంపేశాయి. దీంతో కోళ్ళ కళేబరాలు పలుచోట్ల చిందరవందరగా పడిపోయాయి.మల్లేష్ కు సుమారు 2 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు తెలిపాడు. కోళ్ల పెంపకంపైనే ఆధారపడ్డ తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.