
హైదరాబాద్: పోలీస్, ప్రెస్, ఆర్మీ, ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్లతో తిరిగితే కఠిన చర్యలుంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే వాహనాలపై బ్లాక్ ఫిల్మ్లతో తిరుగుతున్న వాహనాలపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ కారు ఘటన నేపథ్యంలో వాహనాల తనిఖీని హైదరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రెండు వారాల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఎవరైనా రూల్స్ కు విరుద్ధంగా ప్రెస్, పోలీస్, ఆర్మీఎమ్మెల్యే, ఎంపీ స్టికర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. జడ్ప్లస్ కేటగిరి వారు తప్ప ఎవరూ వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ వాడొద్దని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల విజిబులిటీ సరిగా ఉండాలన్నారు. వాహనాలపై అనుమతి లేకుండా బ్లాక్ ఫిల్మ్ వేయొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.