ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో 5400 కరోనా కేసులు నమోదుకాగా.. వీటిలో అత్యధికంగా తిరుపతిలోనే 1700 కేసులు నమోదయ్యాయి. దీంతో తిరుపతిలో రేపటి(మంగళవారం,జులై-21) నుంచి కఠిన ఆంక్షలను విధించారు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. అత్యవసర సేవలు, మెడికల్ షాపులు మినహా మిగతా షాపులు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే షాపులు తెరిచి ఉంటాయని తెలిపారు. మద్యం దుకాణాలు కూడా ఉదయం 11 గంటల వరకే తెరిచి ఉంటాయని చెప్పారు. ఈ సమయం దాటాకా వాహనాలకు కూడా అనుమతి ఉండదన్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత అధికమవుతున్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు కలెక్టర్.
తిరుపతిలోని 48 డివిజన్లు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయని చెప్పారు కలెక్టర్ . మరోవైపు తిరుపతిలో 72 మంది పోలీసులకు కరోనా సోకగా… వారిలో ఇద్దరు మరణించారన్నారు.