ఎగిరివచ్చిన బండరాయి : విద్యార్థి మృతి

ఎగిరివచ్చిన బండరాయి : విద్యార్థి మృతి

సిద్దిపేట రూరల్, వెలుగు: రెండతస్తుల ​బిల్డింగ్​పై చదువుకుంటున్న ఓ స్టూడెంట్​ అనుకోని విధంగా దుర్మరణం పాలయ్యాడు. వంద మీటర్ల దూరం నుంచి ఎగిరివచ్చిన రాయి అతని ముఖానికి తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా తోర్నాలలో శుక్రవారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన చిట్టి మల్లేష్ కుమారుడు సురేష్​ తోర్నాల హాస్టల్​లో ఉంటూ సిద్దిపేట డిగ్రీ కాలేజీలో మెదటి సంవత్సరం చదువుతున్నాడు. డిగ్రీ మొదటి సంవత్సరం 2వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 9న మొదలయ్యాయి. ఆ పరీక్షల కోసం సన్నద్ధం అయ్యేందుకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బిల్డింగ్​పైకి ఎక్కి చెట్టు నీడన చదువుకుంటున్నాడు. పక్కనే రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్నసాగర్​కు కాలువ పనులు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా బ్లాస్టింగ్​ చేశారు. ఆ పేలుళ్లతో బండరాళ్లు ఎగిరిపడి బిల్డింగ్​పై చదువుకుంటున్న సురేష్ తలకు బలంగా తాకాయి. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. తోటి స్టూడెంట్స్,​ హాస్టల్ నిర్వాహకులు సిద్దిపేట రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏసీపీ రామేశ్వర్​సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్టూడెంట్​మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు తోర్నాల హాస్టల్ ముందు స్టూడెంట్​మృతదేహంతో ధర్నా కు దిగారు. బ్లాస్టింగ్ చేసేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలా జరిగేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన స్టూడెంట్​కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. స్టూడెంట్​ మృతిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్టూడెంట్​కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించి అన్నివిధాలా ఆదుకుంటామని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.