ఓయూలో సమాధి కలకలం.. భయంతో పరుగులు

ఓయూలో సమాధి కలకలం.. భయంతో పరుగులు

ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీలోని ఇంజనీరింగ్​ కాలేజీ హాస్టల్ ​వెనుక స్థలంలో సమాధి కనిపించి కలకలం సృష్టించింది. ఆదివారం సాయంత్రం  అటుగా వెళ్లిన కొందరు విద్యార్థులకు సమాధి కనిపించడంతో భయంతో హాస్టల్​కు పరుగు తీసి తోటి విద్యార్థులకు చెప్పారు. చీఫ్​వార్డెన్​ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. సమాధిలో జంతువునా..? మనిషిని పూడ్చిపెట్టారా.? అనేది  తేలాల్సి ఉంది. సమాధిపై చల్లిన పూలు తాజాగా ఉండగా రోజుల్లోనే తవ్వి పూడ్చినట్లుగా ఉంది.  ఓయూలోకి బయటి వ్యక్తులు రాకుండా కొత్త సెక్యూరిటీతో  పటిష్ట బందోబస్తు చేశామని, రౌండ్​ది క్లాక్​ సెక్యూరిటీ పెట్టామని అధికారులు చెపుతుండగా,  మరోవైపు క్యాంపస్​లో సమాధి కనిపించడం విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై ఓయూ చీఫ్​ సెక్యూరిటీ ఆఫీసర్​ గణపతి జాదవ్​ను  ఫోన్​లో సంప్రదించగా స్పందించలేదు. దీనిపై తమకు  ఎలాంటి  కంప్లయింట్​ అందలేదని ఓయూ పోలీసులు తెలిపారు.