ప్రిన్సిపల్​ మందలించడంతో చుంచుపల్లి మండలంలో విద్యార్థి​ సూసైడ్​?

ప్రిన్సిపల్​ మందలించడంతో చుంచుపల్లి మండలంలో విద్యార్థి​ సూసైడ్​?

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  కాలేజీ ప్రిన్సిపాల్, వైస్​ ప్రిన్సిపాల్​ మందలించడంతో  తీవ్ర మనస్థాపానికి గురైన డిగ్రీ స్టూడెంట్ రెహాన్ సూసైడ్​ చేసుకున్నాడు.  విద్యార్థి తండ్రి ఎండీ. ఎజాస్​ పేర్కొన్న ప్రకారం  చుంచుపల్లి మండలం రాంనగర్​కు చెందిన  ఎండీ. రెహాన్​ కొత్తగూడెంలోని ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో  బీసీఏ సెకండ్ ఇయర్​ చదువుతున్నాడు. శుక్రవారం క్లాస్​ రూంలో నిబంధనలకు విరుద్ధంగా రెహాన్​ సెల్ ఫోన్​ వాడుతున్నారని ప్రిన్సిపాల్ నయీం పాషా తనకు చెప్పారని ఎజాస్​ పేర్కొన్నారు. దీంతో తాను కాలేజీకి వెళ్లానని, అక్కడ తన ముందే  రెహాన్​ను మందలించారన్నారు. తర్వాత తాను ఇంటికి వచ్చేశానని తెలిపారు.  అదేరోజు రాత్రి ఇంటి నుంచి వెళ్లిన రెహాన్​ తిరిగి రాలేదన్నారు. రాత్రంతా బంధువులు, ఫ్రెండ్స్​ దగ్గరా వెతికినా దొరకకపోవడంతో శనివారం ఉదయం చుంచుపల్లి పీఎస్​లో మిస్సింగ్​ కేసు పెట్టామని తెలిపారు. 

ఆదివారం రాంనగర్​ సమీపంలోని కుంటలో రెహాన్​ శవమై తేలాడు. స్థానికులు గమనించి తనకు చెప్పారన్నారు.  ప్రిన్సిపాల్, వైస్​ ప్రిన్సిపాల్ వైఖరి కారణంగానే రెహాన్​ సూసైడ్​ చేసుకున్నాడని ఆరోపిస్తూ డెడ్​బాడీతో  కాలేజ్​ఎదుట ఆందోళన చేపట్టేందుకు స్టూడెంట్స్​తో పాటు రెహాన్​ కుటుంబసభ్యులు, బంధువులు యత్నించారు. పోలీస్​లు అడ్డుకోవడంతో  ఉద్రిక్తత నెలకొంది. దీంతో వారు రోడ్డుపై బైటాయించారు.   రెహాన్​ మృతిపై సమగ్ర విచారణ చేపడతామని డీఎస్పీ రెహమాన్ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. కాలేజ్​వద్ద పోలీస్​లు బందోబస్తు ఏర్పాటు చేశారు.