28 రోజుల కింద యువకుడి అదృశ్యం.. ఇంకా దొరకని ఆచూకీ

28 రోజుల కింద యువకుడి అదృశ్యం.. ఇంకా దొరకని ఆచూకీ
  • ప్రేమించిన యువతి బంధువుల మీద అనుమానాలు
  • పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఉందంటూ ఆరోపణలు

నిజామాబాద్, వెలుగు: 28 రోజుల కింద కాలేజీకి వెళ్లిన డిగ్రీ స్టూడెంట్ ఇంటికి తిరిగి రాలేదు. పోలీసులకు కంప్లయింట్ చేసినా.. నేటి వరకు యువకుడి ఆచూకీ దొరకలేదు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్ గావ్ గ్రామానికి చెందిన శ్రీకాంత్.. బోధన్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుకుంటున్న ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి కుటుంబసభ్యులకు తెలియడంతో.. శ్రీకాంత్​ను బెదిరించారు. తమ కూతురికి అమెరికా సంబంధం వచ్చిందని, శ్రీకాంత్​ను అదుపులో పెట్టుకోండని ఇంటికొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన కొద్దిరోజులకే(గత నెల 23 నుంచి) శ్రీకాంత్ కనిపించకుండా పోయాడు. 

పోలీసుల తీరుపై అనుమానాలు..

శ్రీకాంత్ ​28 రోజులుగా కనిపించకుండా పోయినా.. పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అగ్రవర్ణానికి చెందిన యువతి బంధువులు పరువు కోసం ఏదైనా హాని తలపెట్టి ఉంటారని భావిస్తున్నారు. యువతి కుటుంబీకుల మీద అనుమానం ఉందంటూ తమ కంప్లైంట్​లో ఐదుగురి పేర్లను పేర్కొన్నారు. అయినా పోలీసుల విచారణలో ఎలాంటి పురోగతి లేదు. పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై ఏసీపీ కిరణ్ మాట్లాడుతూ.. యువకుడి మిస్సింగ్​కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనుమానితులను విచారించామని, డిజిటల్ ట్రేసింగ్​ ద్వారా ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు.