
ఓయూ (హైదరాబాద్), వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవలే పీహెచ్డీ పూర్తిచేసిన స్టూడెంట్కొంపెల్లి నర్సయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్లో తాను ఉంటున్న గదిలో సోమవారం మధ్యాహ్నం ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఉద్యోగం రాలేదన్న ఆవేదనతోనే నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ప్రభుత్వ హత్యే అంటూ యూనివర్సిటీలో స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నర్సయ్య తన గదిలో ఏదో విషాన్ని ఓఆర్ఎస్ డ్రింక్లో కలుపుకొని తాగినట్టుగా అనుమానిస్తున్నామని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేగానీ ఏమీ చెప్పలేమని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
డోర్ తీయకపోవడంతో..
కొంపెల్లి నర్సయ్య (45) సొంతూరు యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో జాగ్రఫీ సబ్జెక్టుపై పీహెచ్డీ పూర్తి చేశారు. వర్సిటీలోని న్యూపీజీ హాస్టల్రూమ్నంబర్-3లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి గదిలోకి వెళ్లి పడుకున్న నర్సయ్య సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా బయటికి రాలేదు. ఆయన రూమ్ ముందు న్యూస్ పేపర్ కూడా అలాగే పడి ఉండటంతో పక్క రూముల్లో ఉన్న స్టూడెంట్లు తలుపుకొట్టారు. నర్సయ్య ఫోన్ కు కాల్ చేశారు. ఫోన్ రింగ్ సౌండ్ బయటికి వినిపిస్తున్నా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. దాంతో అనుమానం వచ్చి కిటికీ నుంచి తొంగి చూడగా.. నర్సయ్య అపస్మారకంగా పడి ఉన్నారు. స్టూడెంట్లు పెద్ద వెదురు బొంగు తీసుకొచ్చి.. కిటికీలోంచి తలుపు గొళ్లెం తీశారు. అప్పటికే 108కు ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి, నర్సయ్య చనిపోయాడని చెప్పారు. ఓయూ పోలీసులు, క్లూస్ టీమ్ గదిని పరిశీలించి, శాంపిల్స్ సేకరించారు.
కొద్దిరోజులుగా ఉద్యోగం వేటలో..
నర్సయ్య తన ముగ్గురు అక్కలకు పెళ్లి చేశాడని, తల్లిదండ్రులను పోషించేందుకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడని ఓయూ స్టూడెంట్లు చెప్పారు. ఈ ఆవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు నర్సయ్య డెడ్బాడీని గాంధీ మార్చురీకి తరలించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజునే ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందంటూ నిరసన తెలిపారు. దీంతో అంబులెన్సులో కాకుండా పోలీసుల వెహికిల్లో నర్సయ్య డెడ్బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. తర్వాత స్టూడెంట్లు బీ హాస్టల్ వద్ద వర్సిటీ మెయిన్ రోడ్డుపై ఆందోళన చేశారు. పీజీ పూర్తి చేసిన నర్సయ్య జాగ్రఫీ డిపార్ట్మెంట్ లో క్లాసులు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని కోరారని, కానీ అధికారులు పట్టించుకోలేదని ఓయూ స్టూడెంట్లీడర్లు ఆరోపించారు. ఆయన ఆత్మహత్యకు వర్సిటీ అధికారులు బాధ్యత వహించాలన్నారు. మంగళవారం ఓయూ బంద్కు పిలుపునిచ్చారు.